హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఏఎండీ)గా బి. అజిత్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. రసూల్ పురాలోని మెట్రో రైల్ భవన్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించగా.. హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అజిత్ రెడ్డి మెట్రో ఉన్నతాధికారులతో భేటీ అయి సిటీలో మెట్రో ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్–1 కార్యకలాపాలతో పాటు, ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫేజ్-–2 ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొత్త ఏఎండీని కలిసిన వారిలో హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి. ఆనంద మోహన్, జనరల్ మేనేజర్లు ఎం. విష్ణువర్ధన్ రెడ్డి, డి. సూర్యప్రకాశం, శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ వై. సాయప రెడ్డి తదితరులు ఉన్నారు.
