
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. బుధవారం (ఏప్రిల్ 30) పంజాబ్ కింగ్స్ పై ఓడిపోవడంతో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం 10 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతకముందు ముంబైతో చెన్నై మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనీ కూడా వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని చెప్పాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో నిరాశపర్చిన కొంత మంది ప్లేయర్లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వారెవరో ఇప్పుడు చూద్దాం.
రవి చంద్రన్ అశ్విన్:
ఐపీఎల్ 2025 లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా నిరాశపర్చాడు. సొంతగడ్డపై చెలరేగుతాడనుకుంటే చెన్నైకి భారంగా మారాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు పెట్టి తీసుకుంది. అయితే అశ్విన్ మాత్రం ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ ల్లో 44.60 సగటుతో ఐదు వికెట్లు తీసుకున్నాడు. కొన్ని మ్యాచ్ ల్లో ప్లేయింగ్ 11 లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ను చెన్నై వచ్చే ఏడాదికి రిలీజ్ చేయడం గ్యారంటీ గా మారింది.
డెవాన్ కాన్వే
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు గత కొన్ని సీజన్ లుగా నమ్మదగిన ఆటగాడు. 2023, 2022 ఐపీఎల్ సీజన్ లలో అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం కాన్వే ఫామ్ ఏమంత బాలేదు. అతను అంతర్జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ కివీస్ ఓపెనర్ ను రూ. 6. 25 కోట్ల ధరకు దక్కించుకున్నారు. అయితే తన పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ఒక్క హాఫ్ సెంచరీ తప్పితే మిగిలిన మ్యాచ్ ల్లో కనీస ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్ లో ఈ కివీస్ ప్లేయర్ ను పక్కన పెట్టొచ్చు.
రాహుల్ త్రిపాఠి
ఈ సీజన్ లో ఘోరంగా విఫలమైన మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠి. పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడిన త్రిపాఠి.. స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది. ఇప్పటివరకు అతను 96.49 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. 11.00 సగటుతో మరియు ఐదు ఇన్నింగ్స్లలో 57 బంతుల్లో 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 3.80 కోట్లు పెట్టి దక్కించుకున్న త్రిపాఠి.. కొంచెం కూడా న్యాయం చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్ లో త్రిపాఠిని కొనసాగించడం దాదాపు అసాధ్యం.
దీపక్ హుడా
మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ గా పనికొస్తాడని తీసుకుంటే దీపక్ హుడా ఒక్క మ్యాచ్ లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. మెగా ఆక్షన్ లో రూ. కోటి 70 లక్షలకు చెన్నై జట్టులో చేరిన ఈ హిట్టర్.. ఆడిన 5 మ్యాచ్ ల్లో 4 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడంటే అతని ఫామ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫామ్ లేకపోయినా చెన్నై పదే పదే అవకాశాలిస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్ ల్లో 75.61 స్ట్రైక్ రేట్ తో కేవలం 31 పరుగులే చేసి పూర్తిగా ఈ సీజన్ లో చెన్నై జట్టును ముంచేశాడు. ఈ ప్రదర్శనతో చెన్నై హూడాను రిటైన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.
ALSO READ | RR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. హసరంగా, సందీప్ శర్మ ఔట్!