
న్యూఢిల్లీ: ఇండియా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్లో 13.5 బిలియన్ డాలర్ల (రూ.1.16 లక్షల కోట్ల) మిగులు (జీడీపీలో 1.3శాతం) సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 4.6 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.5శాతం) నమోదైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. కరెంట్ అకౌంట్లో భాగంగా ఒక దేశం జరిపే దిగుమతులు, ఎగుమతులు, పెట్టుబడుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లోల మొత్తాన్ని లెక్కిస్తారు.
కిందటేడాది డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో కరెంట్ అకౌంట్లో 11.3 బిలియన్ డాలర్ల లోటు (జీడీపీలో 1.1శాతం) ఏర్పడింది. మొత్తం 2024–-25 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 23.3 బిలియన్ డాలర్లుగా(జీడీపీలో 0.6శాతం)గా ఉంది. ఇది 2023–-24లో రికార్డ్ అయిన 26 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.7శాతం) కంటే తక్కువ. సర్వీసెస్, రెమిటెన్స్ ద్వారా ఇండియా అందుకునేవి పెరగడంతో ఈ లోటు తగ్గింది.