బనకచర్లకు మేం పర్మిషన్‌‌‌‌ ఇయ్యలే.. తెలంగాణ ఈఎన్‌‌‌‌సీ రాసిన లేఖకు సీడబ్ల్యూసీ రిప్లయ్

బనకచర్లకు మేం పర్మిషన్‌‌‌‌ ఇయ్యలే.. తెలంగాణ ఈఎన్‌‌‌‌సీ రాసిన లేఖకు సీడబ్ల్యూసీ రిప్లయ్
  • తాము అనుమతులిచ్చాకే డీపీఆర్​ తయారు చెయ్యాలని ఏపీకి చెప్పినం
  • ఎన్ని ఎకరాలు.. ఎన్ని నీళ్లు కావాలో ఏపీ క్లారిటీ ఇయ్యలే
  • ఏపీ సమర్పించిన నీటి లభ్యత వివరాలూ ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం– బనకచర్ల (ప్రస్తుత పోలవరం –నల్లమలసాగర్​) ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులుగానీ, సూత్రప్రాయ ఆమోదంగానీ తెలుపలేదని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ప్రాజెక్ట్​ డిటెయిల్డ్​ ​ రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఏపీ అక్టోబర్​ 6న టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని, సర్వే, డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సహా ఏ పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరుతూ సీడబ్ల్యూసీ చైర్మన్‌‌‌‌కు అక్టోబర్​ 10న తెలంగాణ ఈఎన్‌‌‌‌సీ జనరల్​ లేఖ రాశారు. దానికి తాజాగా సీడబ్ల్యూసీ చైర్మన్​ రిప్లై ఇచ్చారు. 

పీబీ లింక్​ పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌కు ఇంకా ఆమోదం తెలపలేదని వెల్లడిస్తూ ఈఎన్‌‌‌‌సీకి బదులిచ్చారు. ‘‘రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్‌‌‌‌ను చేపట్టింది. సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది మే 22న   ప్రాజెక్ట్​ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్​ (పీఎఫ్ఆర్​)ను సమర్పించింది. 

పీఎఫ్ఆర్​పై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ), సభ్య రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్​, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌ను పంపించాం. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకతోపాటు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, పీపీఏ  అభిప్రాయాలు వెల్లడించాయి. డీపీఆర్​తయారీకి ఇప్పటివరకూ ఏపీకి మేం ఎలాంటి సూత్రప్రాయ అనుమతులనూ ఇవ్వలేదు. 

ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతానికి సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్​ కమిటీ పరిశీలిస్తున్నది. మానుంచి అనుమతులు వచ్చాకే నిబంధనలకు తగ్గట్టుగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయాలని ఏపీకి స్క్రీనింగ్​ కమిటీ స్పష్టంగా చెప్పింది’’ అని తెలంగాణకు రాసిన లేఖలో సీడబ్ల్యూసీ వెల్లడించింది. 

అవి ఇంకా పరిశీలనలోనే..

ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి జూన్​ 5నే.. అంతర్రాష్ట్ర జల వివాదాల అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా కంప్లయన్స్​ రిపోర్టు ఇవ్వాలని ఏపీకి సూచించినట్టు సీడబ్ల్యూసీ వెల్లడించింది. జులై 14న ఏపీ రిప్లై ఇచ్చినా.. ఇంటర్​ స్టేట్​ మ్యాటర్స్‌‌‌‌ను ఏపీకి గుర్తు చేస్తూ జులై 31న  లేఖ రాసినట్టు గుర్తు చేసింది. ‘‘ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి  హైడ్రాలజీ (నీటి లభ్యత వివరాలు) అంశాలపై జూన్​ 30నే ఏపీకి లేఖ రాశాం. 

జులై 14న ఏపీ ఆ వివరాలను సమర్పించింది. లెక్కల్లో గందరగోళం ఉండడంతో రివైజ్డ్​ హైడ్రాలజీ లెక్కలను సమర్పించాల్సిందిగా ఆగస్టు 4న  లెటర్​ రాశాం. అక్టోబర్​16న ఏపీ హైడ్రాలజీ లెక్కలను పంపింది. వాటిని మేం పరిశీలిస్తున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటికి కంప్లయన్స్​ రిపోర్టులను పంపాలని చెప్పగా.. అక్టోబర్​ 27న ఏపీ పంపించింది. అది కూడా ఇంకా పరిశీలన దశలోనే ఉంది’’ అని  సీడబ్ల్యూసీ వెల్లడించింది.

ఏపీ ఆ వివరాలు ఇయ్యలే..

ప్రాజెక్ట్​ ద్వారా ఏపీ సృష్టించాలనుకున్న కొత్త ఆయకట్టు, స్థిరీకరణకు ఎన్ని నీళ్లు అవసరమవుతాయన్న విషయంపైనా కంప్లయన్స్​ రిపోర్టును ఇవ్వాల్సిందిగా జులై 3న ఏపీకి లేఖ రాసినట్టు సీడబ్ల్యూసీ పేర్కొన్నది. జులై 14న రాసిన లేఖలోనే ఆ విషయాలను ఏపీ పొందుపరిచినా.. స్పష్టత లోపించిందని తెలిపింది. ఏపీ అధికారులతో సమావేశాలు నిర్వహించి మరోసారి స్పష్టమైన లెక్కలు చెప్పాలని, ఎన్ని నీళ్లు అవసరమవుతాయో వివరించాలని చెప్పామని పేర్కొన్నది. అయితే, ఏపీ నుంచి ఇప్పటివరకూ ఆ వివరాలేవీ తమకు అందలేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది. 

మరోవైపు కో బేసిన్​స్టేట్స్​ అయిన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌‌‌‌ నుంచి పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌పై అభిప్రాయాలు రాలేదని, ఆయా రాష్ట్రాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, ఏపీ బనకచర్ల లింక్​ డీపీఆర్‌‌‌‌‌‌‌‌కు పిలిచిన టెండర్లను వాపస్​ తీసుకొని.. కొత్తగా నల్లమలసాగర్​ లింక్‌‌‌‌ను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పోలవరం –నల్లమలసాగర్​ లింక్​ డీపీఆర్‌‌‌‌‌‌‌‌కు ఇటీవలే టెండర్లనూ పిలిచింది.