
-
హోటల్ రివ్యూలు రాయాలని టాస్క్లు ఇచ్చి..
-
2 లక్షలు లాగిన సైబర్ నేరగాళ్లు
బషీర్ బాగ్, వెలుగు: ఆన్లైన్లో టాస్క్ ల పేరుతో నగరానికి చెందిన ఓ 25 ఏండ్ల స్టూడెంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2 లక్షలను లాగారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ శివ మారుతి తెలిపిన వివరాల ప్రకారం... గూగుల్ లో హోటల్స్ , రిసార్ట్స్ కు రివ్యూస్ ఇవ్వాలని , ఒక్కో టాస్క్ కు రూ. 50 చెల్లిస్తామని నేరగాళ్లు యువకునికి వాట్సాప్లో మెసేజ్ చేశారు. అనంతరం బ్యాంక్ వివరాలు సేకరించి , అతడి నెంబర్ ను టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు. మొదటగా ప్రీపెయిడ్ టాస్క్ పేరుతో రూ. వెయ్యి చెల్లించాలని క్యూఆర్ కోడ్ను పంపారు.
దీంతో యువకుడు వెయ్యి పంపి, మొదటి టాస్క్ పూర్తయిన తర్వాత అతనికి డబ్బులను బదిలీ చేశారు. అలాగే మరో రెండు టాస్క్ లకు లాభాలు రావడంతో చీటర్స్ సూచించిన స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేయాలని , అధిక లాభాలు వస్తాయని మరింత నమ్మించారు. దీంతో అతను దఫాలుగా రూ. 2లక్షల 19వేలను ఇన్వెస్ట్ చేశాడు. కానీ వేరే వాటిపై ఇన్వెస్ట్ చేయడంతో ఆ డబ్బులు ఫ్రీజ్ అయ్యాయని , రిలీజ్ కావాలంటే ఇంకొంతమేర డబ్బులు చెల్లించాలని చెప్పారు.
తన డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితుడు ఒత్తిడి చేయగా , అతని నెంబర్ బ్లాక్ చేశారు. మోసపోయాయని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.