సిటీలో సైబర్నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.1.40 కోట్లు నష్టపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఈ మధ్య అతని వాట్సప్నకు గోల్డ్ ట్రేడింగ్ చేయండి.. కోటీశ్వరులవ్వండి అనే మెసేజ్ వచ్చింది.
అందులోని నంబర్కు తాను ట్రేడింగ్కు సిద్ధంగా ఉన్నానని బదులివ్వడంతో ఓ లింకును పంపించారు. అది క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లే ఈయనా చేశాడు. మొదట కొంత డబ్బు పెట్టగా లాభాలు ఇచ్చారు. తరువాత దాన్ని మరింతగా నమ్మి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. లాభం వచ్చినట్లు చూపించినా అమౌంట్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. మరింత డబ్బు పెడితే క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడంతో విడతల వారీగా రూ.70 లక్షలు సమర్పించాడు.
ఎల్లారెడ్డిగూడలో..
ఎల్లారెడ్డిగూడకు చెందిన మరో వ్యక్తికి పార్ట్టైం ఉద్యోగం అని మెసేజ్ పంపించారు. లింక్ క్లిక్చేయగానే సైబర్ నేరగాళ్ల టెలిగ్రాం గ్రూప్తో బాధితుడి నంబర్ లింక్ అయింది. బాధితుడి నమ్మకాన్ని గెలుచుకుని రూ.150 పెట్టుబడి నుంచి రూ.70 లక్షలు పెట్టుబడి పెట్టించి మొత్తం డబ్బులు కాజేశారు. ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.