మీడియాకి వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్: తక్కువ ధరకే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ యార్లగడ్డ రఘుతో పాటు మీనాక్షి, శ్రీనివాస్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ కుంభకోణం వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకి తెలిపారు.
నగరానికి చెందిన యార్లగడ్డ రఘు స్వాదాద్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పలువురిని నమ్మించి మోసం చేశారని సజ్జనార్ తెలిపారు. ఈ స్కాంలో సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో తేలిందన్నారు. 30 మంది ఏజెంట్ల ద్వారా మోసానికి పాల్పడ్డారని, 20 మంది టెలీకాలర్స్ను నియమించుకున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. 2017లో విజయవాడలో ఆఫీసును ఓపెన్ చేశారని, లక్షకుపైగా పెట్టుబడి పెడితే నెలకు 9శాతం వడ్డీ ఇస్తామని చెప్పారని సజ్జనార్ వెల్లడించారు.
ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో స్వాధాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేశారన్నారు. ఫ్లాట్స్ ఇస్తామని ఆశ చూపి 1450 మంది నుంచి రూ.156 కోట్లు వసూలు చేశారని తెలిపారు. బై బ్యాంక్ స్కీం ఓపెన్ ప్లాట్స్ పేరుతో రఘు యార్లగడ్డ మోసానికి పాల్పడినట్లు తేలిందన్నారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
Related Post: ఫ్లాట్లు ,పెట్టుబడి పేరుతో రూ.300 కోట్లు టోకరా