హైదరాబాద్ సిటీ/ గచ్చిబౌలి, వెలుగు: సైబర్ నేరానికి పాల్పడిని ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి టెలీగ్రామ్లో ‘బెన్ సాషా’ అనే పేరుతో సైబర్ చీటర్లు పరిచయం అయ్యారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో దశలవారీగా రూ.21,98,753 పెట్టుబడి పెట్టించారు.
వాటిని వారికి సంబంధించిన వివిధ ఖాతాలకు మళ్లించుకుని ఫోన్ స్విచాఫ్ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితులైన తుమ్మలూరు సుధాకర్ రెడ్డి, తుమ్మలూరు రఘునాథరెడ్డిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సైబర్ క్రైం డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ నెల 6 నుంచి 11 వరకు మూడు కేసులు నమోదు కాగా నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు.
