సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్లు సప్లై... అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్లు సప్లై... అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
  • భారీగా ఏటీఎం, ఆధార్, పాన్ కార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: సైబర్ నేరస్తులకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల గాజులరామారం ద్వారకానగర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీ గణేశ్​నిలయంలో ఈ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. శ్రీ గణేశ్ నిలయంలో నివాసం ఉండే దుర్గాప్రసాద్ గూగుల్​ పే స్కాన్​సేల్స్​ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్నాడు. సనత్​నగర్​కు చెందిన శ్రీనివాస్​రెడ్డి గూగుల్​ పే టీం లీడర్​గా చేస్తున్నాడు. 

చెంగిచెర్ల సాయినగర్​కు చెందిన రమణ జెప్టో రైడర్. చర్చ్​గాగిళ్లాపూర్​కు చెందిన సింహాద్రి అనిల్ మనీ ట్రాన్స్​ఫర్​ఐడీ సప్లయర్. మరొకరు ఉప్పల్ స్వరూప్ నగర్​కు చెందిన బాలరాజు. అందరూ కలిసి గ్యాంగ్​గా ఏర్పడ్డారు. అమాయక ప్రజలను బెదిరించి, వారి బ్యాంక్​అకౌంట్ల వివరాలు, మరికొందరికి డబ్బులు ఇస్తామని వారి ఆధార్, పాన్​ కార్డుల వివరాలు సేకరిస్తున్నారు. వాటితో ఫేక్​ లేబర్​ లైసెన్సులు, రెంట్​అగ్రిమెంట్లు, అడ్రస్​ ప్రూఫ్​లు క్రియేట్ చేస్తున్నారు. 

ఆ తర్వాత ఈ డాక్యుమెంట్లతో బ్యాంక్​అకౌంట్లను ఓపెన్​చేస్తారు. అకౌంట్ హోల్డర్లకు కమీషన్ ఇచ్చి, ఈ మ్యూల్​బ్యాంక్​ఖాతాలను సైబర్​నేరస్తులకు సరఫరా చేస్తున్నారు. పోలీసుల కంట పడకుండా ఎప్పటికప్పుడు తమ అడ్రస్​లు మారుస్తున్న ఈ ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్​చేశారు. 

నిందితుల వద్ద నుంచి భారీ సంఖ్యలో బ్యాంక్​పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డులు, క్యూఆర్ స్కానర్లు, స్వైపింగ్ మెషీన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.