
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ గా డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నేరస్తుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్ ఆర్ వీ ఫణిందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సాప్, ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయించి మోసం చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా, మరో నిందితుడైన నలువాల అర్జున్(33)ను బుధవారం సిద్దిపేట జిల్లాలో అరెస్ట్ చేసి సైబర్ క్రైమ్ కోర్ట్ లో హాజరుపర్చారు. కాగా, కేసు విచారణలో పురోగతి సాధించిన డీఎస్పీ ఫణిందర్ ను, ఎస్సై లు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, సిబ్బందిని సీపీ సునీల్ దత్ అభినందించారు.