ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్తగా జిల్లాల పెరుగుదలతో వచ్చిన మార్పులు చేర్పులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు కొన్ని జిల్లాలకు ఆ అక్కడి మహనీయుల పేర్లను, జిల్లా ఏర్పడిన ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించేలా పేర్లు పెట్టారు.  అందులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది జగన్ సర్కారు. దీనిపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ‘‘ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్  జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!!!” అంటూ ఆమె ట్వీట్ చేశారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అల్లూరి సీతారామ రాజు పేరు.. తిరుమల శ్రీవారి పేరు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఏర్పడిన మరికొన్ని జిల్లాలకు కూడా ఆ ప్రాంతాలకు చెందిన మహనీయుల పేర్లను, ఆయా ప్రాంతాల విశిష్టతను గుర్తించే పేర్లను పెట్టింది ఏపీ ప్రభుత్వం. తిరుపతి కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు వెంకటేశ్వర స్వామి పేరు వచ్చేలా శ్రీ బాలాజీ జిల్లా అని, రాయచోటి కేంద్రంగా ఏర్పడే జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు, శ్రీవారి భక్తుడు అయిన తాళ్లపాక అన్నమాచార్య పేరు మీద అన్నమయ్య జిల్లా అని, పుట్టపర్తి కేంద్రంగా వస్తున్న జిల్లాకు సత్య సాయిబాబా పేరుతో శ్రీ సత్యసాయి జిల్లా అని పేర్లు పెట్టింది. అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన పాడేరు కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరుతో అల్లూరి సీతారామ రాజు జిల్లాగా పేరు పెట్లాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక పార్వతీపురం  కేంద్రంగా ఏర్పటవుతున్న జిల్లాను మన్యం జిల్లా అని పేరు పెట్టారు. అమలాపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాకు ఆ ప్రాంతానికి పాపులర్‌‌గా గుర్తింపు ఉన్న కోనసీమ పేరుతో కోనసీమ జిల్లా అని పేరు పెట్టింది. ఇక నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు పల్నాడు పేరును పెట్టారు.  కాగా, గతంలో నెల్లూరు జిల్లాకు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరును పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వైఎస్‌ఆర్ చనిపోయాక ఆయన పుట్టిన కడప జిల్లాకు ఆయన పేరు మీదుగా వైఎస్‌ఆర్ కడప జిల్లా అని రోశయ్య సీఎంగా ఉన్న సయమంలో నామకరణం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ప్లేస్‌ ఫిక్స్.. చైనా చెరలో ఉన్న బాలుడి అప్పగింతకు ఓకే

పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన లెజెండరీ సింగర్

వైరల్ వీడియో: ఇది కదా జెండావందనం అంటే..