మెహిదీపట్నం, వెలుగు: సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో వరుసగా స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గతవారం టోలీచౌకిలో, ఆసిఫ్ నగర్లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా.. ఆదివారం రాత్రి హబీబ్ నగర్ పరిధిలోని నాంపల్లి దర్గా సమీపంలో స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఆదివారం ఘటన గురించి పోలీసులను అడిగితే ‘అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే అది.. స్ట్రీట్ఫైట్ఏం కాదు’ అని వివరణ ఇచ్చారు. ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరు రాలేదని తెలిపారు.
శుక్రవారం రచ్చ రచ్చ
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఓ కాలేజీ విద్యార్థుల రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్స్టూడెంట్స్మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. సాయంత్రం గొడవ జరగ్గా.. రాత్రి వేళ మురాద్నగర్లో రోడ్లపై రోడ్లపై రెండు గ్రూపులుగా చేరి కర్రలతో కొట్టుకున్నారు.
ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం కాగా, ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, నెల రోజుల కింద టోలీచౌకీలోని రోడ్లపై కొందరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై టోలీచౌకి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా నాంపల్లి పీఎస్పరిధిలోని దర్గా వద్ద నడి రోడ్డుపై కొందరు కొట్టుకుని న్యూసెన్స్ సృష్టించారు.
సరిగ్గా పెట్రోలింగ్ లేకనే..
పోలీసులు సరిగ్గా పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ జోన్పరిధిల్లోని బస్తీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బయట గ్రూపులుగా కూర్చుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని వాపోతున్నారు. 15 రోజుల క్రితం టప్పాచ బుత్రలోని గంగాబౌలి నటరాజ్ నగర్లో అరుగుల మీద కూర్చున్న యువకులను పెట్రోలింగ్ పోలీసులు ఇంట్లోకి వెళ్లమంటూ హెచ్చరించారు.
అయినా పట్టించుకోని వారు పోలీసులపైనే తిరగబడ్డారు. దుర్భాషలాడడంతో సీఐకి చెప్పగా ఆయన కూడా లైట్ తీసుకున్నారు. దీంతో విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సీఐపై సస్పెన్షన్వేటు వేశారు. సీరియస్యాక్షన్తీసుకుంటే ఈ ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.
