- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
అశ్వారావుపేట, వెలుగు: పౌల్ట్రీ ఫామ్ పెట్టిస్తామని చెప్పి ఓ మహిళ నుంచి రూ.3.60 లక్షల దళిత బంధు సొమ్మును బీఆర్ఎస్ యూత్ లీడర్లు కొట్టేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామానికి చెందిన దాసం నాగరత్నం దళిత బంధు కింద పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునేందుకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ అకౌంట్లో గతేడాది జులైలో రూ.10 లక్షలు జమయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న గ్రామానికే చెందిన బీఆర్ఎస్ యూత్ లీడర్లు మోటూరి మోహన్, ఆవుల చిన్ని బాధితురాలి దగ్గరకు వచ్చారు. కోళ్ల ఫారం పెట్టేందుకు ముందుగా మోటార్ వేయాలని రూ.1.80 లక్షలు తీసుకున్నారు. తర్వాత కోళ్ల ఫారం నిర్మాణం కోసం అని మరో రూ.1.83 లక్షలు మొత్తం రూ.3.63 లక్షలు బాధితురాలి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత బాధితురాలు నిర్మాణం పూర్తయిన కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లి వారిని అడగగా.. ఈ స్థలం తమదేనని రూ.3.50 లక్షలు చెల్లిస్తే ఈ ఫారం దగ్గరికి రాణిస్తానంటూ మోహన్ దబాయించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గ్రామ పెద్దలను ఆశ్రయించింది. తర్వాత పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా, కేసు
నమోదైందని, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
