పది లక్షల చొప్పున ఖాతాల్లో జమ చేసిన ఆఫీసర్లు
మరో 10 మందికి త్వరలో ఇస్తామని వెల్లడి
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో 66 మంది ఎస్సీల ఖాతాల్లో ‘దళిత బంధు’ డబ్బు లు జమయ్యాయి. తన దత్తత గ్రామమైన వాసాలమర్రిని గత నెల 4న దళిత బంధుకు సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. మరుసటి రోజు 76 దళిత కుటుంబాలకు సంబంధించి రూ. 7.60 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. డెయిరీ, పౌల్ట్రీ, ట్రాన్స్పోర్ట్, సెంట్రింగ్, వెల్డింగ్, ల్యాండ్ డెవలప్మెంట్ యూనిట్లను దళిత కుటుంబాలు ఎంపిక చేసుకున్నాయి.
వీటి గురించి నెల రోజులుగా ఆఫీసర్లు అవగాహన కల్పించారు. కొత్తగా ‘దళిత బంధు’ ఖాతాలు తీసుకోవాలని సూచించగా.. 66 మంది ప్రూప్స్ ఇవ్వగా మరో 10 మంది ఇవ్వలేదు. ప్రూప్స్ ఇచ్చిన వారికి అధికారులు ఖాతాలు ఓపెన్ చేయించి, ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేశారు. అయితే.. వాటిని లబ్ధిదారులు తీసుకోకుండా అకౌంట్లో ఫ్రీజ్ చేశారు. యూనిట్ ఇచ్చే కంపెనీకే డబ్బును ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారు తాను ఎంపిక చేసుకున్న యూనిట్కు సంబంధించిన ఎస్టిమేట్తో పాటు ఆ యూనిట్ ఇచ్చే కంపెనీ లేదా సంస్థకు సంబంధించిన డిటైల్స్ను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. ఆతర్వాతే అమౌంట్ను కంపెనీ లేదా సంస్థ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. వర్కింగ్ అవసరాల కోసం కొంత మొత్తం నగదును లబ్ధిదారులకు అందివ్వనున్నారు. యూనిట్ ప్రారంభమైన తర్వాత ఒక్కో లబ్ధిదారు ఖాతాలోంచి రూ. 10 వేల చొప్పున ‘దళిత రక్షణ నిధి’కి జమ చేయనున్నారు. ప్రూప్స్ ఇవ్వని మిగిలిన పది మందికి కూడా త్వరలో దళిత బంధు ఖాతాలు ఓపెన్ చేయిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు.
పౌల్ట్రీ, డెయిరీపై క్షేత్రస్థాయి పర్యటన
దళిత బంధు పథకం కింద డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్న వాసాలమర్రికి చెందిన 26 మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లారు. జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, చిన్నకందుకూరు.. భువనగిరి మండలంలోని రాయగిరి, కూనూరులోని డెయిరీ, పౌల్ట్రీ ఫామ్స్కు తీసుకెళ్లారు. అక్కడి రైతులు డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహణపై లబ్ధిదారులకు వివరించారు. ఎలాంటి పద్ధతులు పాటిస్తే పౌల్ట్రీ, డెయిరీ రంగంలో మంచి ఆదాయం వస్తుందో తెలిపారు.