రేవంత్ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తుండు

రేవంత్ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తుండు

కాంగ్రెస్ పార్టీ నుంచి మరో బిగ్ వికెట్ పడిపోయింది. ఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అది చూసి తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హస్తం పార్టీలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ లో  కులం, ధనం  అన్నట్టుగా మారిపోయిందన్నారు. ప్రశ్నించే వాళ్లను సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తూ..సొంత పార్టీ నాయకులను బలహీనపరుస్తున్నారన్నారు.

రేవంత్ ఎవరికీ అందుబాటులో ఉండరు

రాహుల్ ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్ కాంగ్రెస్ ను భ్రష్టుపట్టిస్తున్నాడని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ 24 గంటలు బిజీ అని... ఎవరికీ అందుబాటులో ఉండరన్నారు. పీసీసీ చీఫ్ అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధ చెప్పుకునేందుకు పార్టీలో అవకాశం లేదన్నారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్, సునీల్ కనుగోలు  ముగ్గురూ కుమ్మక్కయ్యారన్నారు. రేవంత్ తప్పులు చేస్తుంటే ఠాగూర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాఫియాను నడిపినట్టు పార్టీ నడుపుతున్నారని ధ్వజమొత్తారు. ఏఐసీసీ నుండి పార్టీని రేవంత్ లీజ్ కు తీసుకున్నట్లుగా ఉందన్నారు. 

కాంగ్రెస్ లో రేవంత్ సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నరు

రేవంత్  కాంగ్రెస్ పార్టీలో తన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నరని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు. పార్టీలో ఎవరినీ లెక్కచేయకుండా నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీ  తెచ్చుకున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నరని తెలిపారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ను భ్రష్టుపట్టిస్తున్నారని..వసూళ్ల పర్వం కోసం రాజకీయాన్ని హస్త గతం చేసుకున్నట్టుగా ఉందన్నారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నా జిల్లాల్లో కమిటీలు వేయలేదని..దళిత దండోరా, నిరుద్యోగ నగారా ఏమైందో ఎవరికీ తెలీదన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నంగా కాంగ్రెస్ ఎదగలేక పార్టీ రోజు రోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పేదలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చా

పేదలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని..పేదోళ్ల గొంతుకగా ఉండాలని ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చానని శ్రవణ్ చెప్పారు. జైపూర్ సభలో రాహుల్ ప్రసంగం విని ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని చెప్పారు. కానీ పార్టీ సిద్ధాంతాలకు రేవంత్ వ్యవహరిస్తుండటంతో తాను చాలా విసిగిపోయాననని...ఏడాది కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కబంద హస్తాల నుంచి విముక్తి చేసేందుకు మలి దశ పోరాటం చేస్తానని చెప్పారు.