
మోత్కూరు, వెలుగు: తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ ఓ మహిళ కత్తితో అత్తపై దాడి చేసింది. మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన బాసాని సత్తమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సత్తమ్మ భర్త నర్సయ్య ఏడాది కింద చనిపోయాడు. చిన్న కొడుకు శ్రీను గ్రామంలోనే ఉంటుండగా, పెద్ద కొడుకు కిష్టయ్య భార్యాపిల్లలతో హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రామంలో ఖాళీగా ఉన్న కిష్టయ్య ఇంట్లో సత్తెమ్మ ఉంటోంది.
అయితే తన ఇంట్లో ఉండొద్దని కిష్టయ్య భార్య జ్యోతి కొన్ని రోజులుగా సత్తమ్మతో గొడవ పడుతోంది. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కిష్టయ్య, జ్యోతి మూడు రోజుల కింద హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సత్తమ్మతో కోడలు జ్యోతి గొడవ పెట్టుకుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగులకొట్టిన అనంతరం మటన్ కొట్టే కత్తితో అత్త సత్తమ్మ తలపై కొట్టింది.
గమనించిన కిష్టయ్య జ్యోతిని అడ్డుకున్నాడు. అనంతరం జ్యోతి అక్కడి నుంచి పరార్ అయింది. తీవ్రంగా గాయపడ్డ సత్తమ్మను మోత్కూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి చెప్పారు.