దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్తాయిలో విజృంభిస్తోంది. అన్ని వర్గాల వారికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రాజస్థాన్ లో ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందగా.. తండ్రి మరణాన్ని తట్టుకోలేని అతడి కుమారై.. తండ్రి చితిలో దూకేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతోంది.
బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి..ఇటీవల కరోనా బారిన పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. శ్మశానంలో చితికి నిప్పంటించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతడి కుమారై చంద్ర శారద(30) తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. చితిలో దూకేసింది. పక్కనే ఉన్న ఆమె సోదరి రక్షించేందుకు యత్నించింది. అక్కడే ఉన్న మిగతా వారు వచ్చి సాయం చేశారు. అయితే.. అప్పటికే చంద్ర శారద తీవ్రంగా గాయపడింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె శరీరం 70శాతానికి పైగా కాలిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకన్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. అక్కడి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే కాలిన గాయాలతో బాధపడుతున్న మహిళ స్టేట్మెంట్ ఇచ్చే స్థితిలో లేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు.