రెండో పెళ్లి చేసుకున్న దావూద్.. కరాచీలోనే మకాం

రెండో పెళ్లి చేసుకున్న దావూద్.. కరాచీలోనే మకాం

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2022లో  దావూద్ రెండో పెళ్లి చేసుకున్నట్లు దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీ షా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు చెప్పాడు. అయితే రెండో పెళ్లి కోసం దావూద్ తన మొదటి భార్య మెహజబీన్కు విడాకులు ఇచ్చాడని చెబుతున్న మాటల్లో నిజం లేదని అలీ షా స్పష్టం చేశాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా దావూద్ రెండవ వివాహం గురించి తెలిసింది. గతేడాది జులై నెలలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, దావూద్ రెండో పెళ్లి గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారత్ లోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అలీషా చెప్పాడు. 

దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్నాడని, అయితే వేరే ఇంటికి మారాడని అలీ షా చెప్పాడు. టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు అలీషా పార్కర్ ను గతంలోనే ప్రశ్నించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం దావూద్ కరాచీ డిఫెన్స్ కాలనీలోని ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని తెలుస్తోంది.