వివాదంలో కళానిధి మారన్.. తమ్ముడి లీగల్ నోటీసులతో సన్ టీవీ స్టాక్ ఢమాల్.. దేనికోసం..?

వివాదంలో కళానిధి మారన్.. తమ్ముడి లీగల్ నోటీసులతో సన్ టీవీ స్టాక్ ఢమాల్.. దేనికోసం..?

మారన్ సోదరుల మధ్య కొనసాగుతున్న ఆస్తి గొడవలు ప్రస్తుతం చిలికిచిలికి పెద్దవయ్యాయి. తాజాగా కళానిధి మారన్ సోదరుడు జీఎంకే ఎంపీ దయానిధి మారన్ తాజాగా లీగల్ నోటీసులు పంపారు. అందులో అన్న సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ తండ్రి 2003లో మరణించినప్పటి నుంచి అక్రమంగా సంస్థ పగ్గాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారంటూ ఆరోపణలు చేశారు. 

ఈ క్రమంలో దయానిధి మారన్ ఇచ్చిన నోటీసుల్లో అన్న కళానిధితో పాటు అతని భార్య, మరో ఏడుగురిపై ఆరోపణలు చేశారు. కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్లు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు కలిసి కంపెనీలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 1965లో పుట్టిన కళానిధి మారన్ ఇంజనీరింగ్ చెన్నైలో పూర్తి చేశాక.. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం అతను మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాల ప్రొడక్షన్, ఐపీఎల్ వంటి వ్యాపారాల్లో ఉన్నారు. ప్రస్తుతం అంచనా ప్రకారం మారన్ మెుత్తం ఆస్తుల విలువ రూ.30వేల 289 కోట్లని తెలుస్తోంది. 

2010లో కళానిధి మారన్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కంపెనీలో మెజారిటీ వాటాలను కూడా కొన్నారు. అయితే తర్వాత కంపెనీ యజమానుల్లో ఒకరైన అజయ్ సింగ్ కి తన వాటాలు తిరిగి అమ్మేశారు. ఇప్పటికీ కంపెనీ నుంచి ఆయనకు కొంత డబ్బు రావాల్సి ఉండగా.. అది కోర్టు పరిధిలో కొనసాగుతోంది. 2003 సెప్టెంబర్ ముందు కంపెనీలో మారన్, కరుణానిధి ఫ్యామిలీలకు సమాన వాటాలు ఉన్నాయి. అయితే షేర్ హోల్డింగ్ రీస్ట్రక్చరింగ్ కార్యక్రమం తర్వాత కళానిధి కంపెనీ బాధ్యతలు తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారని దయానిధి ఆరోపణ.

కళానిధి మారన్ కంపెనీ బోర్డు ఆమోదం లేకుండా తనకు అదనంగా 12 లక్షల ఈక్విటీ షేర్లను అలాట్ చేసుకోవటం వల్ల తాను నష్టపోయానని దయానిధి ఆరోపిస్తున్నారు. ఈ వాటాల ద్వారా కళానిధి మారన్ డివిడెండ్ల రూపంలో 2023 వరకు ఏకంగా రూ.5వేల 926 కోట్లను పొందారని చెప్పారు. కేవలం 2024 ఒక్క ఏడాదిలో రూ.455 కోట్లను దక్కించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కుటుంబ గొడవల్లో సన్ నెట్వర్క్ స్టాక్ ధర తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. నేడు ఇంట్రాడేలో 4 శాతం మేర షేర్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కో షేరు రూ.598 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే వివాదం పూర్తిగా ప్రమోటర్ ఫ్యామిలీకి సంబంధించినదని, దీని వల్ల సన్ టీవీ గ్రూప్ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ ప్రకటించింది. 

దయానిధి మారన్ డిమాండ్..
సన్ టీవీ నెట్‌వర్క్ తో పాటు ఇతర సంబంధిత కంపెనీల మొత్తం వాటాదారుల స్థానాన్ని సెప్టెంబర్ 15, 2003న ఉన్న విధంగా పునరుద్ధరించాలని దయానిధి తన లీగల్ నోటీసుల్లో కోరారు. అలాగే నిజమైన యజమానులకు వాటాలను తిరిగి ఇవ్వాలన్నారు. తన డిమాండ్లను పాటించకపోతే చట్టప్రకారం సివిల్, క్రిమినల్, రెగ్యులేటరీ, ఎన్ ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంటానని అందులో హెచ్చరించారు.