- అంతర్గత శిక్షణలో భాగంగా ప్రజలతో మమేకం
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత శిక్షణ తరగతుల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొత్తం 11 బృందాలుగా విడిపోయి జిల్లాలోని మీర్జాపూర్, పూడూర్, సిద్ధులూర్, పీలారం తదితర గ్రామాలకు వెళ్లి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి వార్డులో ప్రజలతో ముచ్చటించి గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై అభిప్రాయాలను సేకరించారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన అధ్యక్షులు.. అక్కడే అల్పాహారం, భోజనం చేసి విలేజ్ మ్యాప్ను సిద్ధం చేశారు. సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
