ఎయిమ్స్ లో డెడ్ బాడీలు తారుమారు

ఎయిమ్స్ లో డెడ్ బాడీలు తారుమారు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. సొంత కుటుంబ సభ్యులే ఒకరినొకరు తాకడానికి కూడా భయపడేలా చేస్తోంది. ఇక కరోనాతో చనిపోతే కనీసం కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా దక్కడం లేదు. అనాథ శవాల్లా అంత్యక్రియలు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి డెడ్ బాడీకి ఎవరు అంత్యక్రియలు జరుపుతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా కేర్ సిబ్బంది నిర్వాకం వల్ల మంగళవారం ఓ వర్గం డెడ్ బాడీకి మరో వర్గం కుటుంబం అంత్యక్రియలు నిర్వహించి దహనం చేసింది. మరో వర్గం డెడ్ బాడీని ఇంకో వర్గం వాళ్లు ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. డెడ్ బాడీలు అప్పగించే సమయంలో కనీసం ముఖం చూపించే పరిస్థితి లేకపోవటంతో ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి. కొంచం ఆలస్యమైతే ఒక వర్గం వ్యక్తికి చెందిన డెడ్ బాడీని మరో వర్గం వారు ఖననం చేసేవారే. కానీ చివరి నిమిషంలో చనిపోయిన వ్యక్తి పిల్లలు తమ అమ్మను ఒక్కసారి చూడాలని బాడీకి కప్పి ఉన్న కవర్ ను తీసి చూసేసరికి షాక్ అయ్యారు. ఆ డెడ్ బాడీ వాళ్ల అమ్మది కాదు. వేరే ఓ వర్గానికి చెందిన వ్యక్తిది. కరోనాతో చనిపోయిన రెండు వర్గాల వారి డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించే సమయంలో ఒకరి డెడ్ బాడీని మరొకరి కుటుంబానికి ఇచ్చేశారు స్టాఫ్. ఇలా మరో వర్గం డెడ్ బాడీని తీసుకెళ్లిన ఓ వర్గం వారు ఢిల్లీలోని శ్మశాన వాటికలో దహనం చేసేశారు. ఈ విషయం వారికి ఆలస్యంగా తెలిసింది. వారి కుటుంబ సభ్యుడి డెడ్ బాడీని మరో వర్గానికి చెందిన కుటుంబానికి ఇచ్చేశారు. ఈ డెడ్ బాడీ తమ వారిది కాదని శ్మశానికి వెళ్లాక గుర్తించారు. వెంటనే ఎయిమ్స్ కు ఆ బాడీని తీసుకెళ్లి వారికి అప్పగించి ‘మా అమ్మ డెడ్ బాడీ మాకు ఇవ్వండి’ అని కోరారు. అప్పటికే ఆ వర్గానికి కుటుంబానికి చెందిన వ్యక్తి డెడ్ బాడీని ఇంకో వర్గం కుటుంబానికి అప్పగించటం, వాళ్లు అంత్యక్రియలు పూర్తి చేయటం జరిగిపోయింది. దీంతో ఓ వర్గం కుటుంబానికి చెందిన వాళ్లు తమ వారు కాని వ్యక్తికి దహన సంస్కారాలు చేశామని… మా అమ్మ డెడ్ బాడీకి కనీసం అంత్యక్రియలు నిర్వహించలేకపోయామని మరో వర్గం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంక్వైరీ చేస్తున్నాం

ఎయిమ్స్ ట్రామా కేర్ మార్చురీ స్టాఫ్ నిర్వాకం పై ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. సంఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని టర్మినేట్ చేశారు. మరో వ్యక్తిని సస్పెండ్ చేశారు. డెడ్ బాడీ అప్పగించే సమయంలో మృతదేహం ముఖం చూపించాలని కోరినప్పటికీ 500 రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. శ్మశానికి వెళ్లాక కూడా చివరిసారిగా డెడీ బాడీ ముఖం చూసేందుకు 500 రూపాయలు ఇస్తేనే అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.