Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి చేరిన మృతులు

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో  233కి చేరిన మృతులు

ఒడిషాలో జరిగిన  ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.  ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  కాసేపట్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరో వైపు మృతుల్లో బెంగాల్ కు చెందిన వారు ఎక్కువగా ఉండటంతో  సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎంపీ డోలాసేన్ తెలిపారు. 

మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది.  మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 జూన్ 2 రాత్రి  కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్  రైలు మరో ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఒడిషాలోని బాలాసూర్ జిల్లా బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో బోగీలు  ఎగిరిపడ్డాయి. అందులోని  ప్రయాణికులు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయారు.  వందల  సంఖ్యలో ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారు.   

అసలేమైంది...

షాలిమార్ నుంచి  చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12841) మొదట పట్టాలు తప్పింది. -12 బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే కాసేపటి తర్వాత యశ్వంత్‌పూర్-హౌరా రైలు (12864) ట్రాక్‌పై పడిన ఈ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలుకు చెందిన 3-4 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. 


గాయపడ్డారని వారిని బాలాసోర్ మెడికల్ కాలేజీకి, సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నీ ఆస్పత్రుల్లో కలిపి దాదాపు900  మందికి పైగా చికిత్స అందిస్తుండగా.... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ పలు జంక్షన్ల కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. 

HWH Helpline no-033-26382217

KGP helpline no-8972073925, 9332392339

BLS Helpline no-8249591559;7978418322

SHM Helpline no- 9903370746

మోడీ సంతాపం

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో కలత చెందాను.  మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందజేస్తున్నాము” అని ప్రధాని ట్వీట్ చేశారు.