
- కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లిలో ఘటన
జమ్మికుంట, వెలుగు : ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ అఖిలేశ్ (22) బీటెక్ ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. బీటెక్ చేస్తున్న టైంలో ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడడంతో సుమారు రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో అప్పులను కట్టేశారు.
అయినా అలవాటు మార్చుకోని అఖిలేశ్ తిరిగి బెట్టింగ్లు మొదలుపెట్టాడు. ఇందుకోసం ఫ్రెండ్స్తో పాటు వివిధ లోన్ యాప్లలో అప్పులు తీసుకున్నాడు. గురువారం ఉదయం తన గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే కిందకు దించగా అప్పటికే చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం సుమారు రూ. 30 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.