పాస్ పర్సెంటేజీ తగ్గింది

పాస్ పర్సెంటేజీ తగ్గింది

హైదరాబాద్, వెలుగు: సర్కారీ జూనియర్ కాలేజీల్లో రిజల్ట్స్ బాగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే 5 శాతం తగ్గినయి. స్టేట్ యావరేజీతో పోలిస్తే 9 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు దీనిని సీక్రెట్ గా ఉంచారు. గురువారం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్​లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రాష్ట్రంలో 404 ప్రభుత్వ కాలేజీలుండగా.. 1.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ సారి స్టేట్ యావరేజీ ఫస్టియర్లో 60.01 శాతం ఉండగా, సెకండియర్లో 68.86 శాతం పాస్ అయ్యారు. ఈ రెండింటినీ అందుకోవడంలో సర్కారు కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఫస్టియర్ లో 42.33 శాతం, సెకండియర్లో 59.83 శాతం పాస్ పర్సెంటేజీ నమోదైంది. ఒక్క కాలేజీలో కూడా వంద శాతం పాస్ రాకపోగా, ఫస్టియర్లో ములుగు జిల్లా వెంకటాపూర్ కాలేజీలో 0 శాతం పాస్ పర్సెంటేజీ వచ్చింది. ఎయిడెడ్ కాలేజీల్లోనూ భారీగా ఫలితాలు తగ్గాయి. ఫస్టియర్ జనరల్ కేటగిరిలో 39.44 శాతం, సెకండియర్లో 54.01 శాతం పాస్ పర్సెంటేజీ నమోదైంది.

సెకండియర్లో 59.83 శాతమే..

రాష్ర్టంలోని సర్కారు కాలేజీల నుంచి సెకండియర్ జనరల్ కేటగిరీలో 47,235 మంది పరీక్షలు రాస్తే, వారిలో 28,259 మంది పాసయ్యారు. అత్యధికంగా కుమ్రం భీం జిల్లా కౌటాల కాలేజీలో 97.79 శాతం నమోదు కాగా, అత్యల్పంగా యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో 7.14 శాతమే నమోదైంది. ఒకేషనల్లో మాత్రం 69.03 శాతం మంది పాసయ్యారు.

ఫస్టియర్లో 42.33 శాతమే

ఫస్టియర్లో మొత్తం 62,469 మంది పరీక్షలు రాయగా, కేవలం 26,445 (42.33 శాతం) మంది పాస్ అయ్యారు. ఒకేషనల్లో 51.58 శాతం పాసయ్యారు. అయితే కుమ్రం భీం జిల్లా కెరమెరి కాలేజీలో 96.12 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు.

అకడమిక్ ను పట్టించుకుంటలే..

గతేడాది ఫలితాల గందరగోళం నేపథ్యంలో 2019–20 ఆగస్టులో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా పరీక్షల నిర్వహణపైనే అధికారులు దృష్టి పెట్టి, అకడమిక్ ను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ లోనూ ఒక్కసారి కూడా లెక్చరర్లు పాఠాలు ఎలా చెప్తున్నారు? విద్యార్థుల ఫర్ఫామెన్స్ ఎలా ఉంది? అనే అంశాలపై ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి