దేశంలో తగ్గుతున్నకరోనా వ్యాప్తి.. తెలంగాణలో రివర్స్

దేశంలో తగ్గుతున్నకరోనా వ్యాప్తి.. తెలంగాణలో రివర్స్
  • 10.17 లక్షల నుంచి 9.7 లక్షలకు తగ్గిన యాక్టివ్​ కేసులు
  • దేశవ్యాప్తంగా 0.93కి పడిపోయిన ఆర్​ నాట్​ వాల్యూ
  • మార్చిలో 1.7గా నమోదైన కరోనా వ్యాప్తి రేటు
  • తెలంగాణలో మాత్రం రివర్స్​.. రెండు వారాలుగా పెరుగుదల
  • చెన్నై ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేథమెటికల్​ సైన్సెస్​ స్టడీలో వెల్లడి

చెన్నైరోజూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాలూ ఎక్కువవుతున్నాయి. అయితే, ఈ బ్యాడ్​ న్యూస్​ మధ్యనే ఓ గుడ్​ న్యూస్​ కూడా ఉంది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. కేసులు పెరుగుతున్నా.. రికవరీలూ దాని కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా యాక్టివ్​ కేసులు బాగా తగ్గుతున్నాయి. ఒక పేషెంట్​నుంచి మరొకరికి వైరస్​ వ్యాపించే రేట్​(ఆర్​నాట్​ వాల్యూ) ఎన్నడూ లేనంత తగ్గింది. చెన్నైలోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేథమెటికల్​ సైన్సెస్​కు చెందిన ప్రొఫెసర్​ సితాభ్ర సిన్హా నేతృత్వంలోని సైంటిస్టుల టీం చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. ప్రస్తుతం ఆర్​ నాట్​ వాల్యూ ఒకటి కన్నా తగ్గిందని సితాభ్ర సిన్హా స్టడీలో తేలింది. పోయిన వారం ఆర్​వాల్యూ 1.08 ఉండగా.. ఇప్పుడది 0.93కి పడిపోయింది. అంటే వంద మంది పేషెంట్ల నుంచి మరో 93 మందికే కరోనా సోకుతోందన్నమాట. మార్చి నుంచి ఇప్పటిదాకా ఆర్​వాల్యూ ఒకటి కన్నా తక్కువగా నమోదు కావడం ఇదే మొదటి సారి. మార్చిలో ఆర్​ విలువ 1.7గా ఉండేది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతుండడంతో యాక్టివ్​ కేసులు భారీగా తగ్గుతున్నాయి. సెప్టెంబర్​ 17 నాటికి యాక్టివ్​ కేసులు 10 లక్షల 17 వేల దగ్గర ఉండగా.. ఇప్పుడు గురువారం నాటికి ఆ సంఖ్య 9 లక్షల 69 వేల 629కు పడిపోయింది.

ఆ ఐదు రాష్ట్రాల్లోనూ తగ్గింది

రాష్ట్రాల ఆర్​ వాల్యూతో పోల్చినా నేషనల్​ సగటులో పెద్దగా తేడా ఏమీ లేదు. కేసులు ఎక్కువగా ఉన్న ఫస్ట్​ ఐదు రాష్ట్రాల్లోనూ ఆర్​ వాల్యూ బాగా తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్నాటక, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​లలో రోజువారీ కేసులు పెరుగుతున్నా ఒకరి నుంచి మరొకరికి వైరస్​ వ్యాపించే రేటు ఒకటి కన్నా తక్కువగానే ఉంది. కేసుల్లో ఫస్ట్​ ప్లేస్​లో ఉన్న మహారాష్ట్రలో పోయిన వారం 1.17గా ఉన్న ఆర్​ వాల్యూ ఇప్పుడు 0.86కు తగ్గింది. కర్నాటకలో 1.13 నుంచి 0.91కు పడిపోయింది. ఏపీలో పోయిన వారం 0.95గా ఉన్న ఆర్​.. ఇప్పుడు 0.8కి తగ్గింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఆర్​ వాల్యూ జాతీయ సగటు కన్నా తక్కువే ఉంది. తమిళనాడులో ప్రస్తుతం 0.93గా ఉన్న ఆర్​.. పోయిన వారం 0.99గా ఉండేది. యూపీలో 1.1 నుంచి 0.91కి తగ్గింది. ఒడిశా, పంజాబ్​లోనూ తగ్గినా.. విలువ ఒకటి కన్నా ఎక్కువగా ఉంది.

ముంబై, పుణేల్లో తగ్గింది

మొన్నటిదాకా పరిస్థితి తీవ్రంగా ఉన్న మెట్రో సిటీల్లోనూ కరోనా వ్యాప్తి తగ్గిందని స్టడీలో తేలింది. ముఖ్యంగా ముంబై, పుణేల్లో ఆర్​ విలువ సగానికి సగం తగ్గిపోయింది. ముంబైలో పోయిన వారం 1.09గా ఉన్న విలువ.. ఇప్పుడు 0.67కి తగ్గింది. పుణేలో 1.14 నుంచి 0.56కి పడిపోయింది. ఢిల్లీలో పరిస్థితి భిన్నంగా ఉంది. నెల క్రితం వరకు అదుపులోనే ఉన్న కరోనా.. ఈమధ్య మరింత విజృంభించింది. రోజూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడ సెకండ్​వేవ్​ మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోయిన వారం అక్కడ 1.26గా ఉన్న ఆర్​ వాల్యూ.. ఈ వారంలో ఒకటిగా నమోదైంది. చెన్నైలో 0.9, కోల్​కతాలో 1.03గా ఉంది. బెంగళూరులో 1.09 నుంచి 0.93కి తగ్గిపోయింది. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన కేరళలో ఇప్పుడు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. పోయిన వారం 1.07గా ఉన్న ఆర్​వాల్యూ.. ఇప్పుడు 1.2కి పెరిగింది. అస్సాంలోనూ 1 నుంచి 1.04కి ఎగబాకింది.

తగ్గడానికి కారణమేంటి?

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గడానికి కారణం.. కేసులు ఎక్కువగా ఉన్న ఫస్ట్​ ఐదు రాష్ట్రాల్లో ఆర్​ వాల్యూ తక్కువగా ఉండడమే. అయితే, ముందే పెట్టిన లాక్​డౌన్​ వల్ల కూడా కేసుల వ్యాప్తి తగ్గడంలో కీలకంగా మారిందని స్టడీలో సైంటిస్టులు పేర్కొన్నారు. లాక్​డౌన్​ వల్ల రాకపోకలు తగ్గడం, జనాల మధ్య ఇంటరాక్షన్​ లేకపోవడం వంటి వాటి వల్ల కరోనా వ్యాప్తిని ఇప్పుడు తగ్గించగలిగామని సైంటిస్టులు చెబుతున్నారు. ఇటు పోయిన వారంతో పోలిస్తే ఈ వారం టెస్టులు తక్కువ చేయడమూ ఆర్​ వాల్యూ తగ్గుదలకు కారణమేనని వివరిస్తున్నారు. పోయిన వారం సగటున 10 లక్షల 98 వేల టెస్టులు చేస్తే.. ఈ వారం 9 లక్షల 81 వేల టెస్టులే చేశారు. అయితే, బుధవారం రికార్డ్​ స్థాయిలో 14 లక్షల 92 వేల 409 టెస్టులు చేయడం విశేషం.

పెరిగే ప్రమాదముంది

ఆర్​ వాల్యూ తగ్గుతున్నా దేశంలో కరోనా ముప్పు ఇంకా పోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఆర్​ వాల్యూను ఇలాగే మెయింటెయిన్​చేస్తే.. దేశంలో కరోనా క్రమంగా కనుమరుగవుతుందని అంటున్నారు. అయితే, దానికి చాలా టైం పడుతుందని, ఈ గ్యాప్​లో కరోనా కట్టడిని వదిలేయొద్దని సితాభ్ర సిన్హా అన్నారు. లాక్​డౌన్​ టైంలో వ్యాప్తి తగ్గినా.. ఇప్పుడు అన్​లాక్​లో భాగంగా దాదాపు మొత్తం ఓపెన్​ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. జనం చాలా వరకు మాస్కులు పెట్టుకోవడం మానేశారని, సోషల్​ డిస్టెన్స్​ కూడా పాటించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తూ పోతే కేసులు మరింత పెరిగే ముప్పుందని హెచ్చరించారు. నెల క్రితం వరకు ఢిల్లీలో ఆర్​ వాల్యూ ఒకటి కన్నా తక్కువగానే ఉందని, కానీ, ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువైందని గుర్తు చేశారు. దీంతో అప్పటిదాకా కంట్రోల్​లోనే ఉన్న కరోనా మళ్లీ కోరలు చాచిందన్నారు. కాబట్టి ఆర్​ వాల్యూ తగ్గిందని నిర్లక్ష్యంగా ఉండొద్దంటున్నారు.

తెలంగాణలో పెరుగుతున్నది

కేసులు, మరణాలు, టెస్టుల లెక్కలపై మొదట్నుంచి మన రాష్ట్రంలో గందరగోళమే ఉంది. జిల్లాలు ఇచ్చే లెక్కలకు.. ప్రభుత్వం ఓవరాల్​గా ప్రకటించే లెక్కలకు పొంతన ఉండట్లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. రెండు వారాలుగా ఆర్​వాల్యూ కూడా ఒకటి కన్నా తక్కువగానే ఉంది. అయితే, కేసులు ఎక్కువున్న రాష్ట్రాల్లో ఆర్​వాల్యూ తగ్గుతున్నా.. మన రాష్ట్రంలో మాత్రం పెరుగుతోందని స్టడీలో తేలింది. ఆ రాష్ట్రాల్లో కన్నా  ఆర్‌ వాల్యూ ఎక్కువగానే ఉంది. గత వారం 0.92గా ఉన్న ఆర్​వాల్యూ.. ఇప్పుడు 0.94కి పెరిగిందని స్టడీ తేల్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 30,387 యాక్టివ్​ కేసులు న్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రికవరీ రేటు 82.67 శాతంగా ఉంది.