నిర్మలా సీతారామన్ పేరుతో ఫేక్ వీడియో.. హైదరాబాద్ వైద్యురాలికి రూ. 20లక్షలు టోకరా

నిర్మలా సీతారామన్ పేరుతో  ఫేక్ వీడియో.. హైదరాబాద్ వైద్యురాలికి రూ. 20లక్షలు టోకరా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏఐ ఫేక్  వీడియోతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. రూ.21 వేలు పెడితే నెలకు లక్షల్లో లాభాలు వస్తాయని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు ఏఐతో  ఓ వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేసి  బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.  ఈ ఫేక్ వీడియో చూసి ఇటీవలే  హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.3.20 లక్షలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఇదే తరహాలో  నిర్మలా సీతారామన్  ఫేక్ వీడియోను  చూసి పెట్టుబడులు పెట్టిన  ఓ మహిళా వైద్యురాలు ఏకంగా రూ. 20 లక్షలు పోగొట్టుకుంది. 

అసలేం జరిగిందంటే..హైదరాబాద్ కు చెందిన 71 ఏళ్ల ఓ మహిళా వైద్యురాలు   ఆన్ లైన్  లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు  ఓ (ఏఐ) వీడియోను సోషల్ మీడియాలో చూసి నమ్మేసింది.  ఆ వీడియో లింక్ పై క్లిక్ చేసి , పెట్టుబడికి ఆసక్తి ఉన్నట్లు తెలిపింది.  అనంతరం స్కామర్స్ బాధితురాలి వాట్సాప్ కు కాల్ చేసి , రిజిస్ట్రేషన్ కోసం బాధితురాలి ఆధార్ , పాన్ కార్డులు , బ్యాంక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  మరికాసేపటికి ఫిన్ బ్రిడ్జ్ క్యాపిటల్ ప్రతినిధి అంటూ మరో స్కామర్ కాల్ చేసి , మొదట చిన్న మొత్తంలో 20 వేలు పెట్టుబడి పెట్టాలని సూచించాడు.  స్కామర్ మాటలను నమ్మి ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది మహిళ. స్కామర్స్ ఫేక్ ట్రేడింగ్ యాప్ లో అధిక మొత్తంలో లాభాలను డాలర్లుగా చూపిస్తూ మహిళ చేత పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టించారు. 

పలు దఫాలుగా బాధితురాలు మొత్తం రూ. 20,13,305 లను పెట్టుబడి పెట్టింది. అందుకు గాను బిట్ కాయిన్ బ్లాక్ లో $79,850 డాలర్లు లాభాలుగా చూపించారు. బాధితురాలు ఆ డబ్బులను విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా స్కామర్స్ ఇంకా పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు.  దీంతో బాధిత వైద్యురాలు మోసపోయానని గ్రహించి  ఆన్ లైన్  ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.