హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో తప్పు చేయలేదని.. దేశమంతా టీవోటీ (టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానమే నడుస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసినం. ఆయన అంతుచూస్తం” అని హెచ్చరించారు. తెలంగాణలోని ఏ పల్లెలో, పట్టణంలో చూసినా సంక్షేమం, సంతోషమున్నది తప్ప సంక్షోభం లేదన్నారు. కాంగ్రెస్లో మాత్రమే సంక్షోభం ఉందని విమర్శించారు. వచ్చే సారి కూడా 100 శాతం తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్నది.
ప్రపంచంలో ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం.. రైతులకు జీవిత బీమా ఇస్తున్నది.. లక్షా నూట పదహార్ల కానుక ఇచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన రాష్ట్రం... ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ..అది మా పనితనం. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్ రావుకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే బెటర్గా ఉందని రుజువు చేస్తే ఆదివారం పొద్దున ఫస్ట్ అవర్లో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా” అని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలోనూ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి. నేను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఓడించాలి” అని ఆయన అన్నారు.
తెలంగాణలో సంక్షేమం సముద్రమంత, అభివృద్ధి ఆకాశమంత అని పేర్కొన్నారు. శనివారం పల్లె ప్రగతి–పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీఐ కొందరికి రైట్ టు ఇన్కమ్గా మారిందని ఆరోపించారు.