- సీఎం రేవంత్ ఉత్తరం రాస్తే సీబీఐ విచారణ
- అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: లోకసభ ఎన్నికల్లో కోసమే కేఆర్ఎంబీ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ఫైర్ అయ్యారు. కృష్ణాజలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కృష్ణాజలాలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ సీబీఐకి ఉత్తరం రాస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ ప్రారంభమవుతుందని అని అన్నారు. సీబీఐ విచారణ చేస్తే బీఆర్ఎస్ నేతలు పట్టుబడతారని కాంగ్రెస్ భయపడుతోందని వారు ఎద్దేవా చేశారు. విభజనబిల్లులో అన్ని విషయాలు దగ్గర ఉండి రాపించానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీటికి అదనపు నీరు వాడుకోవాలని విభజన అంశాల్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒక్కటేనని, ఎన్నికల సమయంలోనే ఇరుపార్టీలు తిట్టుకుంటాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును అసెంబ్లీలో ఎండగడతామన్నారు. రహస్య ఒప్పందాలు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మోడీ వేవ్ ను సైడ్ ట్రాక్ చేసేందుకే రెండు పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు.. రాష్ట్రంలో అనేక సమస్యలన్నప్పటకీ కేఆర్ఎంబీ నే ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు.