న్యూఢిల్లీ: కమాండర్ లెవల్ చర్చల తర్వాత ఎల్వోసీ నుంచి ఇండో–చైనాలు తమ ఆర్మీ దళాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్లో ప్రస్తుత పరిస్థితిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రివ్యూ చేశారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాతోపాటు మరికొందరు ఆర్మీ సీనియర్ అధికారులతో రాజ్నాథ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారని సమాచారం.
గల్వాన్ లోయతోపాటు పాంగాంగ్ ట్సో వెంబడి ఉన్న గోగ్రా, ఫింగర్ ఏరియాల నుంచి దళాలను వెనక్కి తీసుకోవడం గురించి రాజ్నాథ్కు జనరల్ నరవాణే వివరించారని తెలిసింది. ఎల్వోసీతో పాటు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలో ప్రస్తుత స్థితిని గురించి కూడా నరవాణే ఎక్స్ప్లెయిన్ చేశారని విశ్వసనీయ సమాచారం. తొలి దశ చర్చలు సఫలమవడంతో ఇండో–చైనాలు తమ దళాలను వెనక్కి తీసుకోవడం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో నాలుగో రౌండ్ కమాండర్ లెవల్ చర్చలు ఉండొచ్చని సమాచారం.