జడ్పీటీసీ నుంచి సీఎం దాకా.. రేవంత్ రెడ్డి ప్రస్థానం

జడ్పీటీసీ నుంచి సీఎం దాకా..  రేవంత్ రెడ్డి ప్రస్థానం
  • జడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎదిగిన నేత  
  • స్టూడెంట్ లీడర్​గా ప్రస్థానం ప్రారంభం 
  • ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీ, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • కాంగ్రెస్ స్టేట్ చీఫ్​గా పగ్గాలు చేపట్టి పార్టీకి పూర్వవైభవం తెచ్చిన నాయకుడు

రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం రేవంత్ రెడ్డి. ఆయన జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం దాకా ఎదిగారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, అన్నింటినీ అధిగమించుకుంటూ తనను తాను నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తొలి అడుగులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా అనూహ్య విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా గెలిచి సంచలనం సృష్టించారు. మొదట టీడీపీలో, ఆ తర్వాత కాంగ్రెస్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్​లో చేరిన తక్కువ కాలంలోనే ఆ పార్టీకి స్టేట్ చీఫ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి, ఇప్పుడు సీఎంగా పగ్గాలు చేపడుతున్నారు.  

సొంతూరు కొండారెడ్డిపల్లి.. 

రేవంత్ రెడ్డి 1969 నవంబర్​ 8న పుట్టారు. ఆయన సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్ కు ఆరుగురు అన్నదమ్ములు, ఒక అక్క ఉన్నారు. వీరిలో రేవంత్ ఐదోవాడు. సొంతూరులోనే ప్రాథమిక విద్య పూర్తి చేసిన రేవంత్.. వెల్దండ మండలంలోని తాండ్రలో ఆరో తరగతి, వనపర్తిలో హైస్కూల్, ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. డిగ్రీ చదువుకుంటూనే ఏబీవీపీలో పని చేశారు. అదే టైమ్ లో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ‘జాగృతి’ పేపర్ లో పని చేశారు. అనంతరం కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ నడిపించారు.

జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభం.. 

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జడ్పీటీసీగా మొదలైంది. ఆయన 2004లో అప్పటి టీఆర్ఎస్​లో చేరారు. 2006లో మిడ్జిల్ మండల జడ్పీటీసీ టికెట్ ఆశించారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా టికెట్ దక్కలేదు. దీంతో రేవంత్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి, ప్రతిపక్షాల మద్దతును కూడగట్టి జడ్పీటీసీగా విజయం సాధించారు. తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అనంతరం 2008లో టీడీపీలో చేరారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ క్యాండిడేట్ గుర్నాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మళ్లీ 2014లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

రేవంత్.. గీత.. ఓ లవ్ స్టోరీ

చదువుకునే రోజుల్లోనే రేవంత్​ ప్రేమలో పడ్డారు. ఆయన లవ్​స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్ ​చదివే రోజుల్లో తన క్లాస్​మేట్​ గీతారెడ్డిని రేవంత్ ప్రేమించారు. రేవంత్ వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా ఓకే చెప్పారట. కానీ, గీత ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అయితే, ఆమె మాత్రం తాను రేవంత్​నే పెండ్లి చేసుకుంటానంటూ తేల్చి చెప్పారట. గీత.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి తమ్ముడి బిడ్డ. రేవంత్​తో పెండ్లి ప్రస్తావన రావడంతో ఇంట్లోవాళ్లు ఆమెను ఢిల్లీలోని జైపాల్​రెడ్డి ఇంటికి పంపించేశారు. ఇటు రేవంత్​పైనా రాజకీయంగా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి జైపాల్​రెడ్డితో మాట్లాడేశారట. గీతను తనకిచ్చి పెండ్లి చేయాలంటూ ధైర్యంగా అడిగారట. రేవంత్ ధైర్యం నచ్చి జైపాల్ రెడ్డి తన తమ్ముడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. దీంతో 1992 మే 7న రేవంత్, గీతారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాళ్లకు ఒక కూతురు ఉన్నారు. 

2017లో కాంగ్రెస్ లోకి.. 

అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి, అప్పటి టీఆర్ఎస్ క్యాండిడేట్ మర్రి రాజశేఖర్ రెడిపై 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2021 జులైలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

సొంతూరు జనం సంతోషం.. 

రేవంత్ ను సీఎంగా ప్రకటించడంతో ఆయన సొంతూరు నాగర్​కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లె జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ఊరి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని సంబురపడుతున్నారు. ఇది తమ ఊరికి దక్కిన గౌరవమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రేవంత్ అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఆయన ఎక్కడున్నా దసరా రోజు మాత్రం సొంతూరుకు వచ్చి జమ్మి పూజలో పాల్గొనేవారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా, కొత్తబండి కొన్నా ఊళ్లోని ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసేవారు” అని గుర్తు చేసుకున్నారు.