పురుగుల మందు తాగి డిగ్రీ స్టూడెంట్​ ఆత్మహత్య

పురుగుల మందు తాగి డిగ్రీ స్టూడెంట్​ ఆత్మహత్య
  • రూ.1100 దొంగిలించాడని నిందవేసిన తోటి విద్యార్థులు
  • వార్డెన్​తో పాటు ఐదుగురు స్టూడెంట్లపై కేసు

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ మండలంలో దొంగ అంటూ తోటి స్టూడెంట్లు ముద్ర వేయడంతో అవమానభారంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్యాంపటేల్ కథనం ప్రకారం..జోగాపూర్​గ్రామానికి చెందిన కామెర ప్రభాస్​(20) మందమర్రి జోన్–2 లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ మంచిర్యాలలోని సీవీ రామన్​కాలేజీలో డిగ్రీ ఫస్టియర్​చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ప్రభాస్ రూ.1100 ​దొంగిలించాడంటూ తోటి విద్యార్థులు అతడి బ్యాగును చెక్​చేసి అందులోని డబ్బులను తీసుకున్నారు. దొంగ అని ముద్ర వేయడంతో మనస్తాపానికి గురైన ప్రభాస్ బుధవారం ఉదయం నెన్నెల మండలం జోగాపూర్​లోని తన ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం కూల్​డ్రింక్​లో పురుగుల మందు కలుపుకొని తాగి తర్వాత బయటకు వచ్చి కిందపడిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు ప్రభాస్​ను ఏమైందని ప్రశ్నించారు. దీంతో అతడు జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే అతడిని108లో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా గురువారం మధ్యాహ్నం కన్నుమూశాడు. మృతుడి అన్న రాజశేఖర్​ఫిర్యాదు మేరకు హాస్టల్​వార్డెన్​తో పాటు ఐదుగురు స్టూడెంట్స్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

స్టూడెంట్​ యూనియన్ల ధర్నా  

మృతుడు ప్రభాస్ ​కుటుంబానికి న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్​ఎదుట స్టూడెంట్ యూనియన్లు ధర్నాకు దిగాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ తోపాటు, ప్రభాస్​చావుకు కారణమైన తోటి విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశాయి. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్​గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​చేశారు.