‘ఆపరేషన్​ లోటస్’ ఫెయిల్​ అయ్యింది

‘ఆపరేషన్​ లోటస్’ ఫెయిల్​ అయ్యింది

న్యూ‌‌‌‌‌‌‌‌ఢిల్లీ: డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఇంటిపై సీబీఐతో దాడులు చేయించిన తర్వాత గుజరాత్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) ఓట్​ షేర్​ 4శాతానికి పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ అన్నారు. ఇది ఆప్​కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గిఫ్ట్​ అని చెప్పారు. సిసోడియాను అరెస్టు చేస్తే.. ఇంకో 2 శాతం ఓటు షేర్ పెరుగుతుందని వివరించారు. ఢిల్లీ అసెంబ్లీలో గురువారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్​ విజయం సాధించారు. అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుండగా.. ఆప్​ నుంచి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. విశ్వాస పరీక్షలో హాజరైన ఆప్​ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకే ఓటేశారు. ఇద్దరు ఆప్​ ఎమ్మెల్యేలు విదేశాల్లో, మరొకరు జైల్లో ఉన్నారు. మిగిలిన 59 మందిలో ఒకరు స్పీకర్​గా ఉండటంతో.. 58 మంది సభ్యులు హాజరై ఓటింగ్​లో పాల్గొన్నారు. ఓటింగ్​ జరుగుతున్న టైంలో బీజేపీ ఎమ్మెల్యేలు విజేందర్​ గుప్తా, అభయ్​ వర్మతో పాటు మోహన్​ సింగ్​లు డిప్యూటీ స్పీకర్​ రాఖీ బిర్లాతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని మార్షల్స్​ సాయంతో సభ నుంచి బయటికి పంపించేశారు. దీన్ని నిరసిస్తూ.. మిగిలిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్​ చేశారు. 

ఆప్​ ఎమ్మెల్యేలను కొనలేరు..

విశ్వాస పరీక్ష తర్వాత కేజ్రీవాల్​ మీడియాతో మాట్లాడారు. నిజాయితీపరులైన ఆప్​ ఎమ్మెల్యేలను బీజేపీ కొనలేదనేది దేశంమొత్తానికి తెలిసిందన్నారు. ఆపరేషన్​ లోటస్​ ఫెయిల్​ అయ్యిందన్నారు. జాతీయ స్థాయిలో రెండు పార్టీలే ఉన్నాయని, వాటిలో ఒకటి కట్టర్​ ఇమాన్​దార్ (పక్కా నిజాయితీ), మరొకటి కట్టర్​ బెయిమాన్​ (కఠిన అవినీతి) అని కేజ్రీవాల్​ అన్నారు.  సిసోడియా ఇంట్లో సీబీఐ తనిఖీలు చేస్తే ఎలాంటి అవినీతి సొమ్ము దొరకలేదన్నారు. గ్రామంలోని ఆయన ఇంటితో పాటు బ్యాంకు లాకర్స్​లో కూడా సెర్చ్​ చేశారని వివరించారు. ఆప్​ పార్టీ, సిసోడియా నిజాయితీపరులని మోడీయే సర్టిఫికేట్​ ఇచ్చారన్నారు. గుజరాత్​ ఎన్నికల్లో ఆప్​ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు అవినీతి పార్టీ వే ల కోట్లు ఖర్చు చేస్తోందని, నిజాయితీగల పార్టీ స్కూళ్లు, ఆస్పత్రులు కట్టేందుకు ఖర్చు చేస్తోందన్నారు. నిజాయితీ పార్టీలో చదువుకున్న వాళ్లు, ఐఐటీ డిగ్రీలు పొందినవారు ఉన్నారన్నారు.