
- 15 రోజుల నుంచి ఆరు రోజలకు తగ్గించిన సుప్రీం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన 15 రోజుల మధ్యంతర బెయిల్ ను సవరిస్తూ.. ఆరు రోజులకు కుదించింది. లిక్కర్ స్కాంలో తాజాగా రాఘవకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన 15 రోజుల మధ్యంతర బెయిల్ సవాల్ చేస్తూ ఈడీ.. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. తొలుత ఈడీ తరఫు అడిషనల్ సొలిటిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ.. రాఘవరెడ్డి రెగ్యులర్ బెయిల్ ను ఇప్పటికే ప్రత్యేక కోర్టు తిరస్కరించిందని కోర్టుకు తెలిపారు.
తర్వాత భార్య అనారోగ్యం కారణం చూపుతూ... మధ్యంతర బెయిల్ కోసం రెండోసారి ఎత్తుగడ వేసారని, అయితే ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో వివరణ కోరగా, బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకున్నారని వివరించారు. ఇప్పుడు అమ్మమ్మ అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్ పొందారని తెలిపారు. ఈ వాదనలను రాఘవ తరఫు సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ తొసిపుచ్చారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సవరించింది. జూన్ 12న రాఘవ లొంగిపోవాలని ఆదేశించింది.