న్యూఢిల్లీ: సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రమ్మంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 17న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులలో ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా తాము సమన్లు పంపినా సీఎం కేజ్రీవాల్ రెస్పాండ్ కావడంలేదని ఈడీ ఈ నెల 3న కోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పందించింది. కోర్టు పంపిన ఆర్డర్ను స్టడీ చేస్తున్నామని చెప్పింది. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమనే విషయాన్ని కోర్టుకు వివరించేందుకు రెడీ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ కేసు విచారణకు రమ్మంటూ కేజ్రీవాల్కు ఈడీ ఐదుసార్లు సమన్లు పంపింది.
తొలుత గతేడాది నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, 18న, ఫిబ్రవరి 2న విచారణకు రమ్మని ఆదేశించింది. కానీ, కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారని కేంద్రాన్ని విమర్శిస్తూ వచ్చారు.