- రాజస్తాన్కు ఢిల్లీ షాక్.. 5 వికెట్ల తేడాతో క్యాపిటల్స్ గెలుపు
- చెలరేగిన రాహుల్, అభిషేక్, అక్షర్
- జురెల్, పరాగ్, వైభవ్ మెరుపులు వృథా
ఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. ఛేజింగ్లో అభిషేక్ పోరెల్ (51), కేఎల్ రాహుల్ (56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 193/8 స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ (53) టాప్ స్కోరర్. రియాన్ పరాగ్ (51), వైభవ్ సూర్యవంశీ (46) రాణించారు. రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (12) ఔట్ కాగా.. వైభవ్ సూర్యవంశీ (46), జురెల్ భారీ హిట్టింగ్తో ఇన్నింగ్స్ను ఆదుకున్నారు.
ఈ క్రమంలో 31 రన్స్ వద్ద సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్ను సమీర్ రిజ్వీ వదిలేశాడు. పవర్ప్లేలో 75/1 స్కోరు చేసిన రాయల్స్కు 8వ ఓవర్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. సూర్యవంశీని.. మాధవ్ తివారీ (2/27) ఔట్ చేయడంతో రెండో వికెట్కు 70 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. జురెల్తో జత కలిసిన పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్టింగ్లోనే అతను ఇచ్చిన క్యాచ్ను స్టబ్స్ వదిలేయడంతో ఊపిరీ పీల్చుకున్న పరాగ్.. అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లు బాదాడు. ముకేశ్ ఓవర్లో 23 రన్స్ రాబట్టాడు.
జురెల్ కంటే వేగంగా ఆడిన పరాగ్ 23 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న రాయల్స్కు 15వ ఓవర్లో స్టార్క్ (4/40) బ్రేక్లు వేశాడు. ఐదు బాల్స్ తేడాలో పరాగ్, డొనోవాన్ ఫెరీరా (0), రవి సింగ్ (4)ను పెవిలియన్కు పంపాడు. దాంతో రాయల్స్ 161/6తో నిలిచింది. 17వ ఓవర్లో శుభమ్ దూబే (5)ను తివారీ ఔట్ చేశాడు. 15 బాల్స్ తేడాలో నాలుగు కీలక వికెట్లు పడటంతో పరుగుల వేగం మందగించింది.19వ ఓవర్లో డాసున్ షనక (10)ను ఔట్ చేసిన స్టార్క్ నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. లాస్ట్ ఓవర్లో జురెల్ వెనుదిరగడంతో స్కోరు రెండు వందలు దాటలేదు.
- మెరుగైన ఆరంభం..
ఛేజింగ్లో ఢిల్లీ 19.2 ఓవర్లలో 197/5 స్కోరు చేసి గెలిచింది. స్టార్టింగ్ నుంచే ఫోర్లు, సిక్సర్లు దంచిన రాహుల్, పోరెల్ పవర్ప్లేలోనే 72/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిపారు. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. 4, 6, 4తో పోరెల్ 29 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. దాంతో 10 ఓవర్లలో స్కోరు 105/0కు పెరిగింది.
కానీ 11వ ఓవర్లో బ్రిజేష్ శర్మ (2/44).. పోరెల్ను ఔట్ చేసి తొలి వికెట్కు 105 రన్స్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. సాహిల్ పారక్ (9) నిరాశపర్చినా.. రాహుల్ 34 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. కానీ 15వ ఓవర్లో ఔట్ కావడంతో స్కోరు 133/3గా మారింది. ఇక్కడి నుంచి ఓ ఎండ్లో అక్షర్ పటేల్ (34 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. స్టబ్స్ (4), డేవిడ్ మిల్లర్ (9) నిరాశపర్చినా.. అశుతోష్ శర్మ (18 నాటౌట్)తో కలిసి విజయాన్ని అందించాడు. స్టార్క్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 193/8 (జురెల్ 53, పరాగ్ 51, స్టార్క్ 4/40).
ఢిల్లీ: 19.2 ఓవర్లలో 197/5 (రాహుల్ 56, పోరెల్ 51, ఆర్చర్ 2/35).
