ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో దారుణం జరిగింది. కోర్టు గదిలోనే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోర్టులో న్యాయం జరిగేలా చూస్తానని సదరు మహిళను నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు. రూస్ అవెన్యూలో ఉన్న కోర్టులో 308 నంబరు గదిలో రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా కారణంగా కోర్టులు మూసేయడాన్ని అవకాశంగా తీసుకుని ఆ వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడని తెలిపింది.
లేబర్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పింది. నిందితుడు కోర్టులో పనిచేసే సిబ్బందిలో ఒకరని , అతను తన భర్తకు పరిచయస్తుడేనని తెలిపింది. తెలిసిన వ్యక్తే కదా అని అతని వెంట కోర్టుకు వెళ్లానని. అక్కడ ఎవరూ లేరని గమనించి, గదిలోకి బలవంతంగా తీసుకుని అత్యాచారం చేశాడని బాధిత మహిళ తెలిపింది.పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
