బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె 

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..నిర్మల్ జిల్లా బాసర IIIT (త్రిబుల్ ఐటీ) విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను అధికారులెవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కూడా మద్దతు తెలిపాయి. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులు, భవిష్యత్తు కోసం పోరాడుతున్న వేలాది మంది IIIT బాసర విద్యార్థులకు అండగా ఉంటామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. విద్యాసంస్థలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్లు
1.  ముందుగా సీఎం కేసీఆర్ బాసర IIIT క్యాంపస్ ను సందర్శించాలి.
2.  తక్షణమే వీసీని నియమించాలి. డైరెక్టర్, ఫినాన్స్ ఆఫీసర్ తో పాటు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను కూడా భర్తీ చేయాలి.
3.  విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్యాంపస్ లో మౌలిక వసతులు కల్పించాలి. 
4.  విద్యార్థులకు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా సరైన బోధన ఉండాలి. 
5.  PUC బ్లాక్ లతో పాటు హాస్టళ్ల గదులను వెంటనే పునరుద్ధరించాలి. 
6.  లైబ్రరీ సమయాన్ని మరింత పెంచాలి.
7.  విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
8.  క్యాంపస్ లో PED, PET  టీచర్లను నియమించాలి. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్
తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాసర IIIT విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘అక్కడ కనీస సౌకర్యాలు లేవు. భోజన వసతి లేదు. 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట రెగ్యులర్ వాళ్లు కేవలం 15 మందే ఉన్నారు. వీసీ అసలే లేడు. ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత త్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి. కేసీఆర్ దేశాన్ని ఉద్దరించే పనిలో బిజీగా ఉన్నాడు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

విద్యార్థుల ఆందోళలనకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మద్దతు తెలిపాయి. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద నిరసన తెలియజేసిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధులను గేటు లోపలికి కళాశాల సిబ్బంది అనుమతించడం లేదు. దీంతో మెయిన్ గేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ తో పాటు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఫ్యాకల్టీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.