
రాయికల్, వెలుగు: డెంగీ, మలేరియా వ్యాధులతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, వీటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లయితే బడుగు బలహీనవర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ నీటిని మళ్లీ ట్యాంకులకు ఎక్కించడంతో క్లోరినేషన్ లేకుండానే ప్రజలకు చేరుతున్నాయని, దాంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. రాయికల్ పట్టణ పరిధిలో ఇటీవల డెంగీ జ్వరాలతో కొందరు చనిపోయారని, పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ అధికారులకు పట్టింపు కొరవడిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాయికల్లో నల్లా నీళ్లు చేరని ప్రాంతాల్లో బోర్లను వేయించి 20 కనెక్షన్లను ఏర్పాటు చేశానని, మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండానే వాటికి కరెంట్తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంటనే ఆ బోర్లకు కరెంటు కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.