రూ.40 వేల కోట్లు ఇవ్వండి .. రుణమాఫీ, రైతు భరోసా పథకాలకే అధికం

రూ.40 వేల కోట్లు ఇవ్వండి .. రుణమాఫీ, రైతు భరోసా పథకాలకే అధికం
  • వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు

హైదరాబాద్‌‌, వెలుగు :  కొత్త ప్రభుత్వం రైతు పథకాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో.. వ్యవసాయశాఖ రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు చేసింది. గత బడ్జెట్‌‌లో అగ్రికల్చర్‌‌ సెక్టార్‌‌కు రూ.26,831కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ఈ సారి అదనంగా మరో రూ.14వేల కోట్ల ప్రతిపాదనలు జోడించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రైతు బంధు పథకం రైతు భరోసా పథకంగా మారనుంది. ఇప్పటి వరకు ఏటా ఎకరానికి ఇస్తున్న రూ.10వేలకు మరో రూ.5వేలు కలిపి.. రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌‌ మేనిఫెస్టోలో ప్రకటించింది.

ఈ మేరకు నిధులు పెంచే యోచనలో సర్కారు ఉంది. గత బడ్జెట్‌‌లో రైతుబంధుకు రూ.15070కోట్లు కేటాయించారు. గత సర్కారు 54 ఎకరాల వరకు రైతుబంధు అమలు చేసింది. అయితే కొత్త ప్రభుత్వం రైతు భరోసాకు పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వ్యవసాయశాఖ అధికారులు గైడ్​లైన్స్ రూపొందించే పనిలో ఉన్నారు. ఇదివరకు బీడు భూములు, రియల్‌‌ ఎస్టేట్‌‌ భూములు, ప్రాజెక్ట్‌‌ల కింద సేకరించిన భూములకు డబ్బులు ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసాకు పరిమితి విధించి.. సాగు చేసే భూములకే అమలు చేస్తారని తెలుస్తున్నది.

రుణమాఫీ కటాఫ్‌‌ డేట్‌‌పై తర్జన భర్జన

రూ.2లక్షల రుణమాఫీ అమలుపై కూడా కసరత్తు జరుగుతున్నది. రుణమాఫీ కటాఫ్‌‌ డేట్‌‌తో పాటు ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. గత సర్కారు చేస్తామని చెప్పిన రూ.లక్ష రుణమాఫీ దాదాపు రూ.22వేల కోట్ల వరకు ఉండగా ఇందులో రూ.13వేల కోట్ల వరకే అమలు చేసింది. మిగిలిన రుణమాఫీతో పాటు తాజాగా రూ.2లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపుపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీపై గైడ్‌‌ లైన్స్‌‌ అందిస్తే దాని ప్రకారం బ్యాంకర్లు రైతుల పంట రుణాలను తేల్చనున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసి మొత్తం పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయడానికి రెడీ అవుతున్నది.

రైతు బీమాకు నిధుల పెంపు

గత బడ్జెట్లో రైతు బీమాకు రూ.1,589కోట్ల కేటాయించగా.. ఈ సారి రైతుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో కొంత మేర పెంచి ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. హార్టీకల్చర్‌‌ శాఖ రూ.1000 కోట్ల ప్రతిపాదనలు పంపించింది. అలాగే రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆయిల్‌‌ పామ్‌‌ సాగు కోసం రూ.481కోట్ల అవసరమని పేర్కొంది. ఆయిల్‌‌పామ్‌‌తో పాటు కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్‌‌ గ్రాంట్ల కోసం అన్ని కలిపి వెయ్యికోట్ల ప్రతిపాదనలు చేయడం గమనార్హం.