
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని ఉద్యోగుల జేఏసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ర, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. కేబినెట్ లో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సమస్యల పరిష్కారంపై త్వరలో జీఓలు ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగుల జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మంగళవారం సెక్రటెరియెట్ లో డిప్యూటీ సీఎం, మంత్రులను ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, ముజీబ్, కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్ తో పాటు పలువురు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించడం, ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుపై చర్చలు, 2 డీఏల ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం, మంత్రులకు ఉద్యోగుల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.