- అప్పుడే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం
- ప్యానెల్ చర్చలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు : కాగితంపై అంకెలు వేసుకోవడం సులువేనని, వాస్తవంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ‘ప్రాథమిక విధానం’ మారాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడవ్వాలన్నారు. మంగళవారం గ్లోబల్ సమిట్లో ‘క్యాపిటల్ అండ్ ప్రోడక్టివిటీ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో భట్టి మాట్లాడారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘ఈజ్ ఆఫ్ ఇన్నొవేటింగ్’ వైపు అడుగులు వేయాలన్నారు.
ప్రభుత్వాలు తమను తాము నియంత్రణకర్తలుగా భావించి లైసెన్సులు ఇవ్వడమే గొప్ప అనుకున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇన్నోవేషన్లో రిస్క్ ఉంటుంది కాబట్టి బ్యాంకులు వెనకడుగు వేస్తాయి. కానీ, ప్రభుత్వం రిస్క్ను పంచుకునే క్యాటలిస్ట్గా, ఎకోసిస్టమ్ను సృష్టించే భాగస్వామిగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత సైబరాబాద్కే పరిమితం కాకూడదు.
అవి వరంగల్, నిజామాబాద్ రైతుల బోరింగ్ సమస్యలను పరిష్కరించేలా ఉండాలి” అని భట్టి అన్నారు. కొత్త ఐడియాలతో వచ్చే పారిశ్రామికవేత్తలకు భరోసా అవసరమని ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ అన్నారు. అమెరికాలో ప్రొఫెసర్లు నిధులు సమీకరించి పరిశోధనలు చేస్తారని, మన వర్సిటీల్లో ఆ వాతావరణం లేదని గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పరశురాం అన్నారు.

