హైదరాబాద్, వెలుగు: ప్రజలపై భారం మోపకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియెట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి భూముల లీజు గడువు దాటిన వాటిపై దృష్టి సారించాలన్నారు. గత ప్రభుత్వ ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, ఆనేక త్యాగాలు, పోరాటాలు చేసిన ఫలితంగా వచ్చిన చట్టాల ద్వారా వచ్చిన భూములను పార్ట్ బీలో పెట్టి ఆ రైతుల హక్కులను కాలరాసిందన్నారు.
ధరణి వల్ల ప్రజలకు సంబంధించిన భూములు కొంత మంది ఆధీనంలోకి వెళ్లాయని, అదే విధంగా ప్రభుత్వ భూములు సైతం కొద్ది మంది చేతుల్లోకి వెళ్లాయని వాటిని గుర్తించి తిరిగి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ భూముల వివరాలపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పదేండ్లలో రాష్ట్రానికి 1.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యానవన శాఖల బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై మంత్రి తుమ్మలతో కలిసి భట్టి సమీక్షించారు. రైతు బీమా, పంటల బీమా, రైతుబంధు, ఆయిల్ పామ్ సాగు, ధాన్యం కొనుగోలు, డ్రిప్ సాగుకు కేటాయించిన నిధుల ఖర్చులపై చర్చించారు.