చుక్క నీటినీ వదులుకోం.. బనకచర్ల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్దే: డిప్యూటీ సీఎం భట్టి

చుక్క నీటినీ వదులుకోం.. బనకచర్ల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్దే: డిప్యూటీ సీఎం భట్టి
  • ఏపీ కుట్రలు, కుతంత్రాలు అడ్డుకుంటం: డిప్యూటీ సీఎం భట్టి
  • నాడు ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్​ఎస్​ నేతలు తాకట్టుపెట్టారు
  • పోలవరం కడ్తుంటే చోద్యం చూశారు.. బనకచర్లకు శ్రీకారం చుడ్తుంటే పట్టించుకోలే
  • పదేండ్లలో వాళ్లు చేసిన తప్పులను మేం సరిదిద్దుతున్నం 
  • రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వ్యాఖ్య

ముదిగొండ, వెలుగు: రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బనకచర్ల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్ దేనని.. ఏపీ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుని తీరుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థవంతంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన 10 వేల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులకు ఆదివారం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 5.91 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాంలు రైతులకు అందుబాటులో ఉండేవని, తాము అధికారంలోకొచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాంలను నిర్మించామని చెప్పారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని.. అందుకే  దేశంలోనే వరిని అత్యధికంగా పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 

‘‘ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే  సబ్బండ వర్గాలు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మన రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. సాగునీటి రంగ అభివృద్ధికి పదేండ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యమన్నారు. ‘‘కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులే మన పంట పొలాలకు నీళ్లందిస్తున్నాయి. బీఆర్​ఎస్​ హయాంలో ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే ప్రాజెక్టును కట్టలేదు. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు కూడా నీళ్లందడం లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మాపై విమర్శలు చేయడం మాని, అసలు విషయాలను తెలుసుకోవాలి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. 

తెలంగాణకు పట్టిన శాపం బీఆర్ ఎస్

అప్పటి ఏపీ పాలకులకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్​ఎస్​ నేతలు తాకట్టు పెట్టారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘‘అప్పుడు పోలవరం కడుతుంటే చోద్యం చూశారు. బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంటే పట్టించుకోలేదు. నీళ్లు సముద్రం పాలవుతున్నా పట్టనట్లుగా వ్యవహరించారు. విభజన చట్టంలో లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీలో కలుపుతుంటే స్పందించలేదు. తెలంగాణకు పట్టిన శాపం బీఆర్ ఎస్​”అని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేండ్లలో బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దుతూనే  సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అంతకుముందు ముదిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో డిజిటల్ బోర్డు క్లాసులను భట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యానారాయణ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.