హైదరాబాద్ సిటీ, వెలుగు: వరద ముప్పు లేని నగరమే అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం ఆధ్వర్యంలో వచ్చేనెల డీసిల్టింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం హైడ్రా ఆఫీసులో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు. డీసిల్టింగ్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వరద నీరు సాఫీగా సాగడానికి హైడ్రా అన్ని విభాగాలకు సహకరిస్తుందన్నారు.
నాలాల్లో డీసిల్టింగ్ పనులను జనవరి నుంచే మొదలు పెడతామని, వీటి పర్యవేక్షణలో స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేద్దామన్నారు. బస్తీబాట చేపట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. ఇది తమ పరిధిలోకి రాదని ఇంత పూడికను తాము తీయమని కాంట్రాక్టర్లు అనడానికి వీలు లేకుండా..పనులు పూర్తి చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ సీఈ రత్నాకర్, హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, ఎస్ ఎన్ డీపీ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ జ్యోతిర్మయి పాల్గొన్నారు.

