ఆమనగల్లు,వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్ ఇండిపెండెంట్ సర్పంచ్ రమేశ్నాయక్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని భావించి ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహ, వెంకటేశ్, అమర్ సింగ్, నరేందర్ నాయక్, పార్టీలో చేరిన వార్డు సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
