
శ్రీవారి దర్శనం కోసం రెగ్యులర్ గా భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుంటారు. తిరుమలలో ఉండే రద్దీ కారణంగా ఒక్కోసారి దర్శనం ఆలస్యమవుతుంటుంది. దీంతో చాలా మంది దళారులను ఆశ్రయిస్తుంటారు. అలాంటి భక్తుల కోసం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దళారులను ఆశ్రయించవద్దని సూచించింది టీటీడీ. అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా, టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా మాత్రమే నమోదు చేసుకుని దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఇటీవల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని శ్రీ వనం నటరాజ నరేంద్ర కుమార్, శ్రీ కెఎస్. నటరాజ శర్మల అనే ఇద్దరు రూ 90 వేలు తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమకు 12 మందికి వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని చెప్పి 2024 ఆగస్టు 16వ తేదీన రూ.90 వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుండి పలు మార్లు ఫోన్ చేసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదని ఫిర్యాదు చేశారు.
ALSO READ : తుంగభద్ర పైనా సైలెంట్గా ఏపీ కుట్రలు..!
విశ్వనాథ్ ఫిర్యాదు తరువాత టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట నగరాలలో పలువురిని ఇలాగే మోసం చేస్తున్నారని గుర్తించారు. వీరిపై ఇప్పటికే దాదాపు 12 పోలీస్ కేసులు నమోదయ్యాయి. డబ్బులు వసూలు చేసిన వనం నటరాజ నరేంద్ర కుమార్, నటరాజ శర్మలు టీటీడీ ఉద్యోగులు కాదని.. వీరికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది.
భక్తుల నుండి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్పై టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని, టీటీడీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. టీటీడీ సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , లేదా ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని సూచించింది. టీటీడీ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చు.
దళారుల అక్రమాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పలు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో మోసం చేస్తున్న తీరును వివరిస్తూ ప్రకటనలను విడుదల చేసింది. దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని.. నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొంది.