నెట్వర్క్, వెలుగు: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు భక్తులతో జనసంద్రంగా మారాయి. మహబూబ్నగర్ రూరల్ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుదీరి కోనేరులో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి శివాలయ రామాలయానికి భక్తులు పోటెత్తడంతో ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి.
మెదక్ పట్టణంతో పాటు హవేళీ ఘనపూర్ మండలాల్లో తొలిఏకాదశిని ఘనంగా జరుపుకొని, మార్కెట్లలో కొనుగోళ్లు సాగించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని ప్రసిద్ధ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
