ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి, తలారా స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ? ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
పుష్యమాసం.. శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి ... ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏడాది (2025) అలాంటి పర్యదినం ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 30న వచ్చింది. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ద చూపుతారు. పండుగలకు.. విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక ఏకాదశి రోజుల్లో విష్ణు సంబంధమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కరలేదు. ఈ ఏడాది (2025) ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30న వచ్చింది. ఆరోజున దాదాపు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.
సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున అంటే 2025 జనవరి 10 వ తేదీన వైష్ణవ సంబంధ ఆలయాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు.
పురాణాల ప్రకారం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలను తీరుస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏరాదశులతో సమానమని పండితులు చెబుతారు. క్షీర సముద్రాన్ని మథించేటప్పుడు .. ఈ రోజునే హాలాహలం.. అమృతం పుట్టాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. పరమేశ్వరుడు.. హాలాహలం మింగి కంఠం దగ్గర ఉంచుకోగా... అమృతాన్ని దేవతలు అందరూ పంచుకున్నారు. అప్పటి నుంచి పరమేశ్వరుడి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు.
విష్ణు పురాణం .. ప్రకారం.. మహా విష్ణువు ఆ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచాడని పండితులు చెబుతున్నారు. ఇద్దరు రాక్షసులు.. మహా విష్ణువును దర్శించుకొనేందుకు ఎంతో కాలంగా ఆ ద్వారాల దగ్గర వేచి యున్నారట. ఆ రాక్షసులు పూర్వ జన్మలో చేసిన పాపాల వలన రాక్షసులుగా జన్మించారు. ఆ రాక్షసులు తమ పాపాలను నివృత్తి చేసి.. వైకుంఠ ప్రవేశం కల్పించాలని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు పుష్యమాసం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి.. వారికి ముక్తిని ప్రసాదించాడట. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ( డిసెంబర్ 30) వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు.
ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం....వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
