ఆధ్యాత్మికం: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు

ఆధ్యాత్మికం: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు

మహాభారతం అరణ్యపర్వం చతుర్థాశ్వాసంలో ధర్మవ్యాధుడి కథ మానవజాతికి నీతిని, ధర్మసూక్ష్మాన్ని బోధిస్తుంది. అందునా తల్లిదండ్రుల పట్ల కుమారుల ప్రవర్తన ఉండవలసిన విధానాన్ని  ధర్మవ్యాధుడి కథ ద్వారా ప్రబంధ పరమేశ్వరునిగా ప్రసిద్ధి చెందిన ఎర్రాప్రెగ్గడ వివరించారు.

కౌశికుడు అనే పేరుగల మహర్షి, ఒకనాడు తపస్సు చేసుకుంటున్న సమయంలో ఒక కొంగ అతని భుజం మీద రెట్ట వేసింది. ‘నేను ఈ కొంగకు ఎటువంటి అపకారం చేయకపోయినా, ఇది నా మీద రెట్ట వేసింది’ అంటూ కళ్లు తెరిచాడు. ఆ కంటి చూపుతో కొంగ బూడిదైపోయింది. అందుకు కౌశికుడు బాధపడ్డాడు. నా ప్రయత్నం లేకుండానే ఈ కొంగ మరణించింది అని మనసులో బాధపడుతూ, భిక్షాటన కోసం బయలుదేరాడు. 

ఒక ఇంటి ముందు నిలబడి, ‘భవతీ! భిక్షాందేహి!’ అని పలికాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తేవటం కోసం లోపలకు వెళ్లింది. ఇంతలో... బాగా దెబ్బలు తగిలి, అలసిపోయిన భర్త ఇంటికి వచ్చాడు. ఆవిడ భర్తకు పరిచర్యలు పూర్తి చేసి, అతనికి భోజనం వడ్డించింది. ఆయన భోజనం పూర్తి చేసి శయనించాడు. అప్పటికి గానీ కౌశికుడి విషయం ఆవిడకు గుర్తు రాలేదు. వెంటనే భిక్ష తీసుకువచ్చింది. ‘వచ్చిన అతిథిని ఇంతసేపు నిలబెట్టడం ధర్మమేనా’ అని కోపంగా పలికాడు కౌశికుడు. అందుకు ఆ ఇల్లాలు, ‘మహానుభావా! నువ్వు ధర్మం గురించి తెలుసుకోవాలంటే, ధర్మవ్యాధుని వద్దకు వెళ్లు’ అని పలికింది. తక్షణమే కౌశికుడు.. ధర్మవ్యాధుడి దగ్గరకు బయలుదేరాడు.

ధర్మవ్యాధుడు అనునిత్యం మాంసం అమ్ముతుంటాడు. కౌశికుడు వచ్చే సమయానికి అతడు తన వ్యాపారంలో నిమగ్నమైన కారణంగా, ‘ఓ తపస్వీ, కొద్దిసేపు నిరీక్షించు, వచ్చేస్తాను’ అని పలికాడు. కౌశికుడు కొద్దిదూరంలో నిరీక్షిస్తూ కూర్చున్నాడు. తన పని పూర్తి చేసుకుని వచ్చిన ధర్మవ్యాధునితో కౌశికుడు తనకు కలిగిన అనేక సందేహాలను అడిగాడు. అన్ని సందేహాలకు ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ వచ్చాడు. అంతా అయ్యాక కౌశికుడు, ‘ధర్మవ్యాధుడా! నువ్వు ఏ విధంగా సర్వజ్ఞుడవు అయ్యావో వివరించు. తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది’ అన్నాడు. అందుకు ధర్మవ్యాధుడు...

‘ఏ నిమ్మెయి నుత్తమ విజ్ఞానోన్నతి 
వడయుటకు నిజం బగు మూలం
బైనది గల దొక ధర్మము, భూనుత
యది నీకు దృష్టముగ నెఱిగింతున్‌‌‌‌’ 

ఓ కౌశిక మహర్షీ! నువ్వు నన్ను సర్వజ్ఞుడవు అంటూ ప్రస్తుతించావు. ఈ విధంగా నాకు ఇంతటి విజ్ఞానం సంక్రమించడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేలా తెలియజేస్తాను’ అని పలికి, కౌశిక మహర్షిని గౌరవంగా ఆహ్వానించి, తన ఇంటికి తీసుకునివెళ్లాడు. 

మంచి గాలి, వెలుతురు ఉన్న ఆ ఇంట్లోని మేడ మీద పరిమళాలు గుబాళిస్తున్నాయి. అక్కడ ఒక గదిలో మంచి ఆసనాల మీద ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు కోరిన ఆహారాన్ని వారు తృప్తిగా తింటున్నారు. వారి శరీరాల మీద ధగధగలాడే నగలు ఉన్నాయి. 

ధర్మవ్యాధుడు వారిద్దరినీ కౌశికునికి పరిచయం చేసి, తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు, ‘నీ వంటి మంచి కుమారుడు ఉండగా మాకు లోటేమిటి? నువ్వు ధర్మమూర్తివి. నువ్వు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది, నువ్వు చిరకాలం జీవించి, ధనధాన్యాలతో సుఖంగా ఉండు. నీ ప్రవర్తన వల్ల మన వంశం పావనమైంది. 

నువ్వు కారణజన్ముడివి. దేవతలలో దేవతవు. మానవ మాత్రుడవు కావు. త్రికరణ శుద్ధితో తల్లిదండ్రులను ఆరాధిస్తున్నావు. తల్లిదండ్రులను ఆరాధించే విషయంలో ముందుగా నీ పేరు చెప్పి, ఆ తర్వాతే పరశురాముడి పేరు చెప్పాలి. నీకు సాటి రాగలవారు లేరు’ అని ఆశీర్వదించారు.ఆ మాటలు వినగానే కౌశికుడిలో పరివర్తన కలిగింది. తాను నిర్లక్ష్యం చేసిన తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, వారిని ఆరాధించి, జ్ఞానవంతుడయ్యాడు. 

ఇది భారత కాలం నాటి కథ...

ఈ ఆధునిక యుగంలో వేమన పుత్రుల గురించి... 

తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ..

తల్లిదండ్రుల పట్ల నిర్దయగా ఉండే కుమారుడు పుట్టినా, గిట్టినా ఒకటే. పుట్టలో చెదలు కూడా పుడతాయి. అవి గిడతాయి. ఇంక మనిషికి వాటికి తేడా ఏమిటి.,. అంటూ ఘాటుగా విమర్శించాడు. 

తల్లిదంద్రుల పట్ల త్రికరణ శుద్దిగా గౌరవం కలిగిన వారు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదని పెద్దలు చెబుతారు. వినాయక చవితి కథలోనూ వినాయకుడు, తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గణాధిపత్యం సాధించాడు. అందుకే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అన్నారు. ఆలయాలలో ప్రదక్షిణలు కాకుండా, తల్లిదండ్రుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండటం ప్రధానమని ధర్మవ్యాధుడి కథ చెబుతోంది.
 
–- డా. పురాణపండ వైజయంతి–