
హిందువులు దీర్ఘకాలంగా సమస్యలతో ఇబ్బంది పడుచున్నప్పుడు.. పండితులను సంప్రదిస్తారు. ఏ వ్యక్తికైనా జీవితములో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుందని నమ్ముతుంటారు . అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు పిశాచ పీడా భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. వారాహి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని పూజిస్తే నరఘోష తొలగుతుంది.
ప్రతి ఏడాది ఆషాఢ శుద్ద పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 4 వరకు వచ్చాయి. చాలా మంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారాహి నవరాత్రులను జరుపుతారు.
వారాహి మాత పూజ ఫలితం ఇదే..!
- వారాహి నవరాత్రుల సమయంలో పూజలు చేసి, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి, శుద్ధికరణకు కూడా ఇది మంచి సమయం.
- వారాహి మాత భక్తులు ఈ పండుగ సమయంలో ఉపవాసం చేస్తూ, నిష్ఠగా పూజలు చేస్తారు.
- దిష్టి దోషాలు, దృష్టి దోషాలు, నరఘోష, మానసిక సమస్యలు, అయాసం, ఆందోళనలను తొలగించడానికి వారాహి మాతకు పూజ చేయడం మంచిది.
- అలాగే వారాహి మాతను ఆరాధించడం వలన గుర్తింపును పొందవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. సత్ఫలితాలను కూడా పొందవచ్చు.
అమ్మవారికి ఎలా పూజ చేయాలి?
వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరపరు. చాలా మంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చెయ్యచ్చు. అందులో తప్పు లేదు. పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి, ఎర్రటి పూలను సమర్పించి, అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి.
దీపం, దూపం, అష్టోత్తరం, నైవేద్యం, హారతితో పూజను పూర్తి చేయాలి. సులభంగా పూజ చేసినా అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుక పానకం, వడపప్పు తప్పక పెట్టండి. పులగం, పాయసం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు పెడతారు. పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించాలి.
సులభంగా, మంచి రోజులు కావడంతో, అమ్మవారికి పూజ చేసుకుని నివేదన చేయవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా పైన చెప్పినట్లుగా పూజ చేయొచ్చు. నవరాత్రులు పూర్తయిన తర్వాత తొమ్మిదో రోజు గానీ, పదో రోజు గానీ అమ్మవారి చిత్రపటాన్ని పైన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చని పండితులు చెబుతున్నారు.